ఎన్నికలున్నా జగన్ భజనే
ABN , Publish Date - Apr 27 , 2024 | 03:24 AM
సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ పాఠశాల విద్యాశాఖ తీరు మారడం లేదు. ఇప్పటికే చిక్కీలు, పుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఆ శాఖ..
పిల్లల పాఠ్యపుస్తకాల్లో సీఎం, మంత్రి బొత్సకు కృతజ్ఞతలు
కోడ్ను విస్మరించిన విద్యాశాఖ
అందుబాటులోకి పీడీఎ్ఫలు
అమరావతి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ పాఠశాల విద్యాశాఖ తీరు మారడం లేదు. ఇప్పటికే చిక్కీలు, పుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఆ శాఖ.. ఇప్పుడు 2024-25 పాఠ్య పుస్తకాల రూపకల్పనలోనూ అదే పంథా కొనసాగిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం కోసం తయారు చేసిన కొత్త పాఠ్యపుస్తకాల పీడీఎఫ్ కాపీలను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. విద్యార్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సీఎం జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణల పేర్లు పెట్టి, వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలపడం విమర్శలకు దారితీస్తోంది. పాఠ్యపుస్తకాలు రూపొందించిన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ(ఎ్ససీఈఆర్టీ) డైరెక్టర్ బి. ప్రతా్పరెడ్డి ప్రతి పుస్తకంలో ముందు మాట రాశారు. అందులో జగన్, బొత్సలకు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ రోజుల్లో ఇది మామూలే అయినా కోడ్ అమల్లో ఉన్న సమయంలో, రాజకీయ నేతల పేర్లు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండకూడదని ఈసీ స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి మరీ సీఎం, మంత్రి పేర్లు పెట్టారు. అంటే ఒకవేళ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా ఏడాది పాటు జగన్ పేరు పుస్తకాల్లో ఉండేలా ఎస్సీఈఆర్టీ ప్లాన్ చేసిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి పేర్లు పెట్టడమే కాకుండా, వాటిని ఎన్నికలకు ముందే విడుదల చేసి కోడ్ను తుంగలో తొక్కారు.