Share News

జనం లేక విలవిల..!

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:58 PM

గడ్డం గ్యాంగ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గురువారం నాటి నామినేషన్‌ కార్యక్రమం బొక్కబొర్లా కొట్టింది. ఏదో జరుగుతుంది అనుకుంటే, మరేదో జరగడంతో అటు గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, ఇటు గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ తీవ్ర అసహనంతో రగిలిపోయారు. జనాలు పల్చగా కనిపించడంతో ఏం తోచని స్థితిలో గుడివాడలో కొడాలి నాని ఎడ్లబండి దిగి కారులో వెళ్లిపోగా, గన్నవరంలో వల్లభనేని వంశీ అయితే ఎండలో అసహనంతో ఊగిపోయారు. రెండుచోట్లా నాయకత్వలేమి స్పష్టంగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. - గుడివాడ, గన్నవరం

జనం లేక విలవిల..!

గుడివాడ, గన్నవరంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ నామినేషన్‌కు జనం కరువు

అసహనంతో ఎడ్లబండి తోలే వ్యక్తిపై చేయిచేసుకున్న నాని

జనం కనిపించకపోవడంతో ర్యాలీ మధ్యలోనే జంప్‌

ర్యాలీకి రండంటూ అనుచరుడు శశి రోడ్డుపై వేడుకోలు

గన్నవరంలోనూ దాదాపు ఇదే పరిస్థితి

జనం కనిపించకపోవడంతో మండిపోయిన వంశీ

పెనమలూరు నుంచి జనాన్ని తెచ్చే యత్నం.. విఫలం..

రెండుచోట్లా స్పష్టంగా కనిపించిన నాయకత్వలేమి

గడ్డం గ్యాంగ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గురువారం నాటి నామినేషన్‌ కార్యక్రమం బొక్కబొర్లా కొట్టింది. ఏదో జరుగుతుంది అనుకుంటే, మరేదో జరగడంతో అటు గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, ఇటు గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ తీవ్ర అసహనంతో రగిలిపోయారు. జనాలు పల్చగా కనిపించడంతో ఏం తోచని స్థితిలో గుడివాడలో కొడాలి నాని ఎడ్లబండి దిగి కారులో వెళ్లిపోగా, గన్నవరంలో వల్లభనేని వంశీ అయితే ఎండలో అసహనంతో ఊగిపోయారు. రెండుచోట్లా నాయకత్వలేమి స్పష్టంగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. - గుడివాడ, గన్నవరం

గుడివాడలో గలాటా..

మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానీకి రోజురోజుకూ అసహనం పెరుగుతోంది. ఓటమి భయం పట్టడంతో ఏం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితికి చేరారు. గతంలో నాని తన కారు డ్రైవర్‌పై బూతులతో విరుచుకుపడగా, గురువారం నాటి నామినేషన్‌ ర్యాలీలో ఎడ్లబండి తోలే వ్యక్తి తలపై కొట్టారు. తొలుత వేలమందితో నామినేషన్‌ వేయాలని కొడాలి నాని అనుకున్నారు. పార్టీ నాయకులను పిలిచి జనాన్ని సమీకరించాలని ఆదేశించారు. స్థానిక రాజేంద్రనగర్‌లోని ఇంటి నుంచి గురువారం ప్రారంభమైన ఆయన ర్యాలీ ఇరుకు రోడ్ల మీదుగా ఏలూరు రోడ్డు ఎక్కే వరకూ సాఫీగానే సాగింది. ర్యాలీలో నానీతో పాటు వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము పాల్గొన్నారు. అక్కడి నుంచి కార్యకర్తలు, అభిమానులు ఆశించినంత స్థాయిలో కనిపించలేదు. దీంతో నాని, ఆయన ముఖ్య అనుచరుడు శశిలకు అసహనం పెరిగింది. ఈ క్రమంలో ఎడ్లబండి నడుపుతున్న వ్యక్తిపై నాని ఆగ్రహం చూపించారు. అటు కాదు.. ఇటు వెళ్లాలి.. అంటూ తలపై ఒక్కటి కొట్టారు. ఇదిచూసిన నాయకులు, కార్యకర్తలు హతాశులయ్యారు. నాని ముఖ్య అనుచరుడు ర్యాలీ వెంట నడుస్తూ రహదారి వెంబడి కనిపించిన ప్రతి వ్యక్తినీ ర్యాలీలో రావాలని వేడుకోవడం కనిపించింది. స్థానిక నెహ్రూచౌక్‌ సెంటర్‌కు ర్యాలీ వచ్చేసరికి జనం మరీ పలచగా కనిపించారు. దీంతో నాని అసహనానికి గురై ఎడ్లబండి దిగి కారులో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న శశి నాయకులపై చిందులు తొక్కి చేతిలో సెల్‌ఫోన్‌ను నేలకేసి కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. అనుకున్న స్థాయిలో జనాలు లేకపోవడంతో వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని అలిగి వెళ్లిపోవడంతో స్థానిక నెహ్రూచౌక్‌ సెంటర్‌లో అభిమానులు రోడ్డుపైనే పూల బస్తాలు వదిలేశారు.

పోలీసుల అత్యుత్సాహం

కొడాలి నాని ర్యాలీకి అనుమతి ఇచ్చిన రూట్‌మ్యాప్‌ను పోలీసులు ఒక్కసారిగా మార్చేశారు. దీంతో స్థానిక రాజేంద్రనగర్‌లోని నాని స్వగృహం సమీపంలో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ కె.ఇంద్ర శ్రీనివాసరావు మార్చిన రూట్‌మ్యాప్‌ ప్రకారం అటుగా అనుమతి లేదని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు పాలడుగు రాంప్రసాద్‌, వల్లూరుపల్లి సుఽధాకర్‌లు సీఐతో వాగ్వాదానికి దిగారు. సీఐ ససేమిరా అనడంతో ర్యాలీ పోలీసులు అనుమతిచ్చిన రూట్‌లోనే సాగింది.

గన్నవరంలో గడబిడ

గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ నామినేషన్‌ సందర్భంగా డబ్బు, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఇంతచేసినా ఆయన నామినేషన్‌లో జనాల సందడి కరువైంది. గ్రామ, మండల స్థాయిలో వైసీపీని వెంటాడుతున్న నాయకత్వ సమస్య నామినేషన్‌ సందర్భంగా బయటపడింది. గ్రామాల్లో వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.500 వరకూ ఇచ్చారు. క్వార్టర్‌ బాటిల్‌, బిర్యానీ ప్యాకెట్‌ ఇచ్చి బైకులపై వచ్చిన వారికి పెట్రోల్‌ కొట్టించారు. ఇంతచేసినా జనాలు పెద్దగా లేకపోవడంతో వంశీలో కాస్త అసహనం కనిపించింది. నామినేషన్‌ వేశాక ఆయన మాట్లాడిన మాటల్లో ఇది స్పష్టమైంది. గురువారం మధ్యాహ్నం నామినేషన్‌ కార్యక్రమం జరిగింది. ఎండ మండుతుండటంతో బలవంతంగా తీసుకొచ్చిన ప్రజలు ఎండ బారిన పడి అల్లాడిపోయారు. ర్యాలీలో ఎక్కువ మంది పెనమలూరు నియోజకవర్గ జనాలే కనిపించారు. గన్నవరం నియోజకవర్గంలో మండల, గ్రామస్థాయి నాయకులు టీడీపీలోకి వలస పోవడంతో వైసీపీని నాయకత్వలేమి వెంటాడు తోంది. గురువారం నాటి నామినేషన్‌ కార్యక్రమంలో అది స్పష్టమైంది. డబ్బు ఇచ్చినా జనాలను తరలించేందుకు నాయకులు కొరవడటంతో జనసమీకరణలో వంశీ విఫలమయ్యారని సొంతపార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. నామినేషన్‌ వేసేందుకు వల్లభనేని వంశీ ర్యాలీగా రావటంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ర్యాలీకి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయబోయి కిందపడిపోయారు. తీవ్ర గాయాలయ్యాయి.

ఓటమి భయమా..?

తన చివరి ఎన్నికలంటూ కొడాలి నాని ఇప్పటికే సానుభూతి అస్త్రం

అదే బాటలో వల్లభనేని వంశీ కూడా..

వచ్చే ఎన్నికల్లో దుట్టా కుమార్తె పోటీ అంటూ మరో వ్యాఖ్య

మాటలతో దుట్టా ఫ్యామిలీని మంచి చేసుకునే ప్రయత్నం

నామినేషన్‌ అనంతరం కల్లబొల్లి కబుర్లు

నాడు పదవి రాకుండా అడ్డుపడి.. నేడు ఓట్ల కోసం డ్రామాలు

‘వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు కూతురు సీతామహాలక్ష్మి వైసీపీ తరఫున పోటీలో ఉంటారు. ఆమెకు మేము సపోర్టు చేస్తాం. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, గతంలో ఏ రకంగా అయితే విజయవాడ పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయినా మా అమ్మ పేరుతో చారిటబుల్‌ ట్రస్టు పెట్టి గన్నవరంలో ఏ విధంగానైతే సేవలు చేశామో అవన్నీ కొనసాగుతాయి.’

..గురువారం గన్నవరంలో నామినేషన్‌ వేసిన అనంతరం వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలివి. ఒకప్పుడు దుట్టా రామచంద్రరావును నానా దుర్భాషలాడిన వంశీకి అకస్మాత్తుగా ఆయన కుమార్తె గురించి ఎందుకంత పాజిటివ్‌గా మాట్లాడారు? ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో ఒక్కసారిగా దుట్టా ఫ్యామిలీపై ప్రేమ ఎందుకు పొంగుకొచ్చింది..? అనే గుసగుసలు గన్నవరం నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి.

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : ఆది నుంచీ దుట్టా రామచంద్రరావు కుటుంబం ఎదుగుదలను ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహించలేకపోయారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రభావవంతమైన నాయకుడిగా ఉన్న దుట్టా రామచంద్రరావుకు వైఎస్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌లో, ఆ తర్వాత వైసీపీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన దుట్టా.. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ చేతిలో 10వేలలోపు ఓట్లతో ఓడిపోయారు. 2019లో వైసీపీ అధిష్ఠానం యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్‌ కేటాయించినా దుట్టా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఎప్పుడైతే వంశీ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారో అప్పటి నుంచి దుట్టా అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో దుట్టా వర్గం మద్దతు కోసం వంశీ ఎత్తులు వేయడం ప్రారంభించారు. ఇటీవల నియోజకవర్గంలో బస్సు యాత్ర చేసిన సమయంలో జగన్‌ వద్దకు దుట్టా రామచంద్రరావును పిలిపించిన వంశీ తనకు మద్దతుగా పనిచేయాలని చెప్పించగా, ఆయన ఎలాంటి హామీ ఇవ్వకుండా వెనుదిరిగారని సమాచారం. దీంతో ఎలాగైనా దుట్టా మద్దతు కూడగట్టేందుకు తొలుత ఆయన అల్లుడు శివభరత్‌రెడ్డితో తనకు అనుకూలంగా మాట్లాడించిన వంశీ.. తాజాగా దుట్టా కుమార్తె మద్దతు కూడగట్టేందుకు వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందని ప్రకటించి మైండ్‌గేమ్‌కు తెరదీశారు. ఈ కారణంగానైనా దుట్టా మద్దతు లభిస్తుందన్న ఆలోచనలో వంశీ ఉన్నట్లు తెలుస్తోంది.

నాడు పదవి రాకుండా చేసి..

వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దుట్టా సీతామహాలక్ష్మి ఉంగుటూరు నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. జెడ్పీ చైర్మన్‌ పీఠం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో కాపు సామాజికవర్గానికి చెందిన సీతామహాలక్ష్మికి జెడ్పీ పీఠం ఖాయం అన్న ప్రచారం జరిగింది. అయితే, చివరి నిమిషంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ చక్రం తిప్పి గుడివాడ నియోజకవర్గం పరిధిలో ఉన్న గుడ్లవల్లేరు జెడ్పీటీసీగా గెలుపొందిన బీసీ సామాజికవర్గానికి చెందిన ఉప్పాల హారికకు చైర్‌పర్సన్‌ పీఠం దక్కేలా చేశారు. దుట్టా కుటుంబానికి జెడ్పీ పీఠం దక్కితే గన్నవరం నియోజకవర్గంలో తనకు పోటీ అధికార కేంద్రం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో వంశీ పావులు కదపడం వల్లే దక్కాల్సిన పదవి దక్కకుండా పోయిందని అప్పట్లో దుట్టా వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఓటమి భయం వెంటాడుతుండటంతో వంశీ అదే కుటుంబానికి పదవి ఆశచూపి పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని దుట్టా వర్గీయులు విమర్శిస్తున్నారు.

ఇవే చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్‌ డ్రామా

వంశీ గురువారం చేసిన వ్యాఖ్యల్లో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సీతామహాలక్ష్మి వైసీపీ తరఫున పోటీ చేస్తారని, తాను ఆమెకు మద్దతు ఇస్తానని చెప్పారు. ‘ఇవే నా చివరి ఎన్నికలు.. నన్ను గెలిపించాలి..’ అని పరోక్షంగా ప్రజలకు విజ్ఞప్తి చేసి సెంటిమెంట్‌తో ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు చేశారు. మరోవైపు ఆయన మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది. గతంలో విజయవాడ పార్లమెంట్‌ నుంచి పోటీచేసి ఓడిపోయినా గన్నవరం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు కొనసాగించానని, ఈసారి కూడా సేవలు కొనసాగుతాయని అన్న మాటలు అందుకు సంకేతాలు ఇచ్చేలా ఉన్నాయని వైసీపీ నాయకులే చెబుతున్నారు. వంశీ సన్నిహితుడు, గుడివాడ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని కూడా ఇవే తన చివరి ఎన్నికల సెంటిమెంట్‌ను ఇప్పటికే గుడివాడలో ప్రయోగించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తన సోదరుడి కొడుక్కి ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తాడని నాని ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చివరి ఎన్నికలు కాబట్టి ఈ ఒక్కసారి తనకు ఓటు వేయాలంటూ ఓటర్లను సెంటిమెంట్‌తో ఆకట్టుకునేందుకే నాని ఈ డ్రామా ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తం మీద బూతు బ్రదర్స్‌గా పేరొందిన నాని, వంశీలు ఇద్దరూ ఒకే సెంటిమెంట్‌ అస్త్రాన్ని నమ్ముకుని ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నించడం గమనార్హం.

Updated Date - Apr 25 , 2024 | 11:59 PM