Share News

గులకరాయిలో రహస్యమేంటి?

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:03 AM

సీఎం జగన్‌పై ఈనెల 13వ తేదీన జరిగిన గులకరాయి దాడికి సంబంధించి పోలీసులు కొత్త సమాచారాన్ని రాబట్టారా? పోలీసు కస్టడీలో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ కుమార్‌ ఏ విషయాలు వెల్లడించాడు? అనే అంశాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి.

గులకరాయిలో రహస్యమేంటి?

ప్రధాన నిందితుడు సతీష్‌తో ఉన్నది ఎవరు..?

రాయి విసరొద్దని వారించిన మరో వ్యక్తి ఎవరు?

నేటితో ముగియనున్న సతీష్‌ కస్టడీ

కేసులో ఇంకా తేలని ఏ2 పాత్ర

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : సీఎం జగన్‌పై ఈనెల 13వ తేదీన జరిగిన గులకరాయి దాడికి సంబంధించి పోలీసులు కొత్త సమాచారాన్ని రాబట్టారా? పోలీసు కస్టడీలో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ కుమార్‌ ఏ విషయాలు వెల్లడించాడు? అనే అంశాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. సతీష్‌ కుమార్‌ను రెండు రోజుల క్రితం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కస్టడీ గడువు శనివారంతో ముగిస్తుంది. ఇప్పటికే పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో కొన్ని విషయాలను పేర్కొన్నారు. ఏ2 ప్రోద్బలంతో సతీష్‌ కుమార్‌ రాయితో దాడి చేశాడని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఏ2గా వేముల దుర్గారావును అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు. సతీష్‌ కుమార్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దుర్గారావును అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మూడు రోజులపాటు అతడిని విచారించిన పోలీసులు తర్వాత ఇంటికి పంపేశారు. సతీష్‌ కుమార్‌ను కోర్టులో హాజరుపరిచిన రోజే దుర్గారావును ఇంటికి పంపారు. కేసులో ఏ2 ఉన్నాడని రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేసినందున అతడు ఎవరన్నది నిగ్గు తేల్చాల్సి ఉంది.

విషయం చెప్పాడా?

గులకరాయి దాడి కేసులో ప్రధాన నిందితుడు సతీష్‌ కుమార్‌ అన్నది పోలీసుల వాదన. తమ కుమారుడికి ఏ పాపం తెలియదన్నది సతీష్‌ తల్లిదండ్రుల వాదన. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న సతీష్‌తో పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేసినట్టు సమాచారం. 13వ తేదీన పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సతీష్‌ వడ్డెర కాలనీలో ఉన్న సిమెంట్‌ బల్లపై స్నేహితులతో కూర్చున్నట్టు సమాచారం. అక్కడే వడ్డెర కాలనీకి చెందిన మరో వ్యక్తి కూర్చున్నాడు. ఇద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నట్టు సమాచారం. ఈ వివరాలను సతీష్‌ పోలీసులకు వివరించాడని తెలిసింది. సతీష్‌ వద్ద కూర్చుని మాట్లాడిన వ్యక్తి ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. సీఎం వాహనం అజిత్‌సింగ్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ దిగగానే అక్కడ రాయి విసరడానికి ప్రదేశాన్ని ఎంచుకున్నానని సతీష్‌ చెప్పినట్టు తెలిసింది. అప్పటికే ఫ్లై ఓవర్‌కు ఊడిపోతున్న శ్లాబ్‌ రాయిని జేబులో వేసుకున్నానని వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. గులకరాయి వేయడానికి ప్రయత్నించగా, సీఎం బస్సుకు చుట్టుపక్కల ఉన్న రోప్‌ పార్టీలు పక్కకు తోసేశాయని వివరించినట్టు తెలిసింది. రెండోసారి వేయడానికి ప్రయత్నించగా, పక్కనే ఉన్న స్నేహితుడు వద్దని వారించాడని చెప్పినట్టు సమాచారం. ఆ సమయంలో సతీష్‌ పక్కనే ఉన్న స్నేహితుడు ఎవరన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తర్వాత బస్సుతో పాటే కార్యకర్తలతో కలిసి వివేకానంద స్కూల్‌ వరకు వెళ్లి అక్కడ రాయి విసిరానని సతీష్‌ పోలీసులకు చెప్పినట్టు లీకులు వస్తున్నాయి. వివిధ వీడియో క్లిప్పింగ్‌లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు సాంకేతికంగా విశ్లేషించినప్పుడు సతీష్‌ రాయి విసిరిన దృశ్యాలు కనిపించాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వాటిని కోర్టుకు అందజేస్తామంటున్నాయి. సతీష్‌ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇప్పించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ తీర్పు ఈనెల 29వ తేదీకి వాయిదా పడింది. సతీష్‌ వాంగ్మూలం ఆధారంగా ఆ రోజున సతీష్‌ను కలిసిన వ్యక్తిని, దాడి వద్దని వారించిన స్నేహితుడిని విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

Updated Date - Apr 27 , 2024 | 01:03 AM