పోటెత్తిన అభిమాన దండు
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:41 PM
సార్వత్రిక ఎన్నికల కీలక ఘట్టం నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణకు తెర పడింది.
టీడీపీ అభ్యర్థులు టీజీ భరత్, రాఘవేంద్రరెడ్డి నామినేషన్లు
కర్నూలులో తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
మంత్రాలయంలో కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
కర్నూలు, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల కీలక ఘట్టం నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణకు తెర పడింది. చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కర్నూలు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ ర్యాలీ అట్టహాసంగా సాగింది. ఓల్డ్ టౌన్ (పాత బస్తీ) సహా నగరం నలుమూల నుంచి టీడీపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చాయి. కూటమి మిత్ర పక్షాలు జనసేన, బీజేపీ శ్రేణులు భరత్ ర్యాలీలో పాల్గొన్నాయి. పెద్దమార్కెట్ రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ, రిటైర్డ్ ఐజీ ఇక్బాల్, జనసేన ఇన్చార్జి అర్షద్, బీజేపీ కన్వీనర్ సూర్యప్రకాశ్, టీజీ విభులతో పాటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ముఖ్య నాయకులతో కలసి టీజీ భరత్ అంబేడ్కర్ సర్కిల్, కొండారెడ్డి బురుజు, కంట్రోల్ రూం సర్కిల్, చిల్డ్రన్ పార్కు మీదుగా ర్యాలీగా నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ఎ.భార్గవతేజ ఆఫీసుకు చేరుకున్నారు. గజ మాలలతో టీజీ వెంకటేశ్, టీజీ భరత్లను అభిమానులు సత్కరించారు. అనంతరం ఆర్ఓ ఏ.భార్గవతేజకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
నామినేషన్ దాఖలు చేసిన మంత్రాలయం అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి
మంత్రాలయం టీడీపీ అభ్యర్థి మాధవరం నల్లగౌని రాఘవేంద్రరెడ్డి మాధవరం గ్రామం నుంచి ఎనిమిది కిలో మీటర్లు భారీగా ర్యాలీతో మంత్రాలయం ఆర్ఓ కార్యాలయం చేరుకుని నామినేషన్ దాఖాలు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, బీజేపీ ఆదోని డివిజన్ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, జనసేన ఇన్చార్జి బి.లక్ష్మన్నలతో కలసి మంత్రాలయం, కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు మండలాల నుంచి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలసి మాధవరం, మాలపల్లి మీదుగా 8 కిలో మీటర్లు ర్యాలీ నిర్వహిస్తూ మంత్రాలయం చేరుకున్నారు. టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి సహా కూటమి నాయకులను తెలుగుతమ్ముళ్లు గజమాలలతో సత్కరించారు.