పెళ్లింట విషాదం
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:26 AM
మండలంలోని పెద్దయమ్మనూరు గ్రామంలో శనివారం పెళ్లింట విషాదం నెలకొంది.
కుందూ నదిలో ఈతకు వెళ్లి బావ మృతి
మరదలి పరిస్థితి విషమం
ఉయ్యాలవాడ, ఏప్రిల్ 27: మండలంలోని పెద్దయమ్మనూరు గ్రామంలో శనివారం పెళ్లింట విషాదం నెలకొంది. కుందూ నదిలో పడి బావ మృతి చెందగా.. మరదలి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన రామాంజనేయులుకు ఐదుగురు కుమార్తెలు. చిన్న కుమార్తెకు ఈ నెల 25వ తేదీన వివాహం జరిపించారు. అయితే ఈ నెల 26వ తేదీన తిరుపెళ్లి జరిగింది. ఈ పెళ్లికి తన మూడో కుమార్తె శివాణి, ప్రవీణ్ దంప తులు వచ్చారు. శనివారం మధ్యాహ్నం రామాంజనేయులు నాలుగో కుమార్తె కెజియా, ఆదిలక్ష్మిలతో పాటు, మూడో అల్లుడు, కూతురుతో కలిసి స్థానిక కుం దూనదిలో ఈతకు వెళ్లారు. కుందూనదిలో రైతులు నీటి నిల్వ కోసం తీసిన గుంతను గమనించలేక కాలుజారి అందులో ప్రవీణ్, కెజియా పడి ఈత రాక గల్లంతయ్యారు. దీంతో అక్కడే ఉన్న శివాని, ఆదిలక్ష్మి కేకలు వేయటంతో అక్కడికి గ్రామస్థులు చేరుకొని వారిని బయటకు తీశారు. వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే ప్రవీణ్ (29) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కెజియా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.