బుగ్గన నామినేషన్ ఎందుకు తిరస్కరించలేదు..?
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:12 AM
వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్లో ఎన్నో తప్పులున్నప్ప టికీ ఎందుకు తిరస్కరించలేదని టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ప్రశ్నించారు.
ఆర్వో ఆమోదించడంపై న్యాయ పోరాటం
టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు
డోన్, ఏప్రిల్ 27: వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్లో ఎన్నో తప్పులున్నప్ప టికీ ఎందుకు తిరస్కరించలేదని టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ప్రశ్నించారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్, లీగల్ సెల్ న్యాయవాదులు శ్రీనివాస భట్, కోట్ల హరిశ్చంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి మహేశ్వరరెడ్డి వ్యవహరించిన తీరు అభ్యంతరమని అన్నారు. వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్లో తప్పులున్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఫారం-26ఏలో కాలమ్స్ పూరించకుండా ఖాళీగా ఉంచినా, సమాచారాన్ని ఇవ్వకపోయినా నామినేషన్ పత్రాలను తిరస్కరించే అధికారం ఆర్వోకు ఉందని తెలిపారు. ఎస్ ఫర్ బుక్ కాండేట్్ 54, 55, 56 నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాల్లో బుగ్గన తన ఆస్తులను సక్రమంగా కనబరచలేదని అన్నారు. ఇట్లాంటి నామినేషన్ పత్రాలను ఆర్వో ఎందుకు తిరస్కరించలేదని ప్రశ్నించారు. మొదట పెండింగ్లో ఉంచినా.. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి టీడీపీ అభ్యంతరాలను పక్కన పెట్టి, ఎలాంటి విచారణ లేకుండా ఏకపక్షంగా బుగ్గన నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారని ఆరోపిచారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, న్యాయవాదులు ఆలా మల్లికార్జున రెడ్డి, జనసేన నాయకులు ఆలా మోహన్ రెడ్డి, తోట మనోహర్ బాబు పాల్గొన్నారు.