టీడీపీతోనే మైనారిటీల అభివృద్ధి
ABN , Publish Date - Apr 27 , 2024 | 01:44 AM
టీడీపీ హయాంలోనే మైనారిటీల అభివృద్ధి జరిగిందని టీడీపీ నాయకులు షేక్ మౌలాలి, పటాన్ ఇబ్రహీంఖాన్ స్పష్టం చేశారు.
మార్కాపురం వన్టౌన్, ఏప్రిల్ 26: టీడీపీ హయాంలోనే మైనారిటీల అభివృద్ధి జరిగిందని టీడీపీ నాయకులు షేక్ మౌలాలి, పటాన్ ఇబ్రహీంఖాన్ స్పష్టం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడారు. పట్టణంలో వైసీపీ నాయకులు ఓటమి భయంతో టీడీపీ-బీజేపీ పొత్తుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. నిన్న మొన్నటి దాకా బీజేపీతో చట్టాపట్టాలేసుకు తిరిగిన వైసీపీ నాయకులు నేడు ఎన్డీఏ కూటమిపై విమర్శలు చేయడం తగదన్నారు. తమ అధినేత చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్లో హజ్హౌస్, కడప, విజయవాడలలో హజ్హౌస్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. వైసీపీ హయాంలో మైనారిటీల అభివృద్ధి శూన్యమన్నారు. మైనారిటీల అభివృద్ధికి షాదీఖానాలు కట్టించింది టీడీపీ హయాంలోనేనని, పట్టణంలోని షాదీఖానాకు వైసీపీ నాయకులు ఏ గతి పట్టించారో అందరికీ తెలుసన్నారు. టీడీపీ హయాంలో పేదల కోసం రంజాన్ తోఫా, విద్యార్థు లకు విదేశీవిద్య చంద్రబాబుదేనని అన్నారు. మస్జీద్ల అభివృద్ధికి రూ.25 వేల చొప్పున రూ.35.94కోట్లు చంద్రబాబు కేటాయిస్తే వైసీపీ హయాంలో కేవలం రూ.87 లక్షలు మాత్రమే మంజూరయ్యాయన్నారు. మహిళల ఆర్ధికాభివృద్ధికి టీడీపీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. పేదల కోసం దుల్హాన్ పథకం ప్రవేశపెడితే వైసీపీ హయాంలో అనేక ఆంక్షలు పెట్టి పథకాన్ని నీరుగార్చారన్నారు. పట్టణంలో, నియోజకవర్గంలో కందుల నారాయణరెడ్డి ఖబరస్తాన్లకు నిధులు కేటాయించి ప్రహరీగోడల నిర్మాణం చేపట్టారన్నారు. వైసీపీ హయాంలోనే మైనారిటీలపై దాడులు పెరిగి కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న విషయం కూడా రాష్ట్ర ప్రజలకు గుర్తుందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మతపరమైన రాజకీయాలు మానాలని హితవు పలికారు. తమ నాయకుడు కందుల నారాయణరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మొఘల్ ఫిదా హుస్సేన్ బేగ్, మహబూబ్ బాషా, పటాన్ గులాబ్ ఖాన్, మొఘల్ జాబీర్ హుస్సేన్ బేగ్, షేక్ నూరుల్లా, పఠాన్ హుస్సేన్ ఖాన్, షేక్ చిన్న మౌలాలి, ఆబీద్ బాషా, షేక్ ఆబీద్, షాలీ, మస్తాన్ వలి, నాగూర్ వలి, మహమ్మద్ రహీం, డాక్టర్ షేక్ కాశీం తదితరులు పాల్గొన్నారు.
అవకాశం ఇవ్వండి.. మార్కాపురాన్ని అభివృద్ధి చేస్తా
తర్లుపాడు : ఒక్క అవకాశం ఇస్తే మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మీర్జపేట పంచాయతీలోని కారుమానుపల్లె, గొల్లపల్లె, నాగెళ్ల ముడుపు, తాడివారిపల్లెల్లో శుక్రవారం కందుల నారాయణరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి సాగు, తాగు నీరు అందిస్తామన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 85 శాతం పనులు పూర్తి అయితే వైసీపీ ప్రభుత్వం 15 శాతం కూడా పూర్తి చేయ కుండా శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనె మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఉడుముల చిన్నపురెడ్డి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు కంచెర్ల కాశయ్య, పుచ్చనూతల గోపినాథ్ చౌదరి, మండల యూత్ అధ్యక్షు లు మేకల వెంకట్, నాయకులు నరసింహులు, జాను, నారాయణరెడ్డి, చలమారెడ్డి, చిట్టిబాబు, శాంతయ్య, గురవయ్య, శ్రేణులు పాల్గొన్నారు.
టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి
పొదిలి : టీడీపీతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమౌతుందని విఘ్నేష్రెడ్డి అన్నారు. ఇంటింటికి ‘మన కందుల కార్యక్రమం’ శుక్రవారం మండలంలోని కంభాలపాడు గ్రామంలో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన విఘ్నేష్రెడ్డి మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన మార్కాపురం టీడీపీ అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి పోటీ చేస్తున్నారన్నారు. కనుక ప్రతి ఒక్కరు కందుల నారాయణరెడ్డిని రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా తన తండ్రి కందుల నారాయణరెడ్డి ప్రజాసేవలోనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధి యువతకు భరోసా టీడీపీ పాలనలోనే ఉంటుందనే విషయం గుర్తు చేసుకోవాలని కోరారు. వెలుగొండ ప్రాజెక్ట్, మార్కాపురం జిల్లా ఏర్పాటుకు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు పధకాలను చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టనున్నారని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్ధించారు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే పొదిలి మండలానికి వెలుగొండ జలాలతోపాటు తాగు, సాగునీరు అందించేందుకు కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు గమనించి రాబోవు ఎన్నికల్లో తమకు మద్దతు పలకాలని ఆయన కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారని, మార్కాపురం జిల్లా చేయడమే మొదటి లక్ష్యమన్నారు. కనుక ప్రతి ఒక్కరు ఉమ్మడి ఎంపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసరెడ్డిని, మార్కాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధిగా కందుల నారాయణరెడ్డిని అత్యధిక మొజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో మండల, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.