Share News

రాజీనామా చేయకుంటే అంతే!

ABN , Publish Date - Apr 24 , 2024 | 01:24 AM

గ్రామ వలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేయాలని ఇన్నాళ్లు ఒత్తిడి చేసిన అధికార పార్టీ నేతలు రూటు మార్చారు. ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి చేసినా జిల్లాలో ఆశించిన స్థాయిలో వలంటీర్లు స్పందించకపోవడంతో... వలంటీర్లుగా పని చేస్తే ఇబ్బందులు తప్పవని, రాజీనామా చేసి వైసీపీ కోసం పని చేసిన వాళ్లకు మాత్రమే భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటూ ఐప్యాక్‌ బృందం ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు.

రాజీనామా చేయకుంటే అంతే!
చింతపల్లిలో ఈ నెల 15న రాజీనామా చేసిన వలంటీర్లు

- వలంటీర్లకు ఐప్యాక్‌ ద్వారా హెచ్చరికలు

- విధుల్లో వున్న వాళ్లకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని సంకేతాలు

- అధిక శాతం వలంటీర్లు రాజీనామాలకు దూరం

- జిల్లాలో 352 సచివాలయాల్లో 5,670 మంది వలంటీర్లు

- ఇప్పటికి రాజీనామా చేసింది కేవలం 526 మందే

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

గ్రామ వలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేయాలని ఇన్నాళ్లు ఒత్తిడి చేసిన అధికార పార్టీ నేతలు రూటు మార్చారు. ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి చేసినా జిల్లాలో ఆశించిన స్థాయిలో వలంటీర్లు స్పందించకపోవడంతో... వలంటీర్లుగా పని చేస్తే ఇబ్బందులు తప్పవని, రాజీనామా చేసి వైసీపీ కోసం పని చేసిన వాళ్లకు మాత్రమే భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటూ ఐప్యాక్‌ బృందం ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు.

జిల్లాలోని 22 మండలాల పరిధిలో 352 సచివాలయాల్లో 5,670 మంది వలంటీర్లు పని చేస్తున్నారు. వైసీపీ ఒత్తిడి మేరకు ఇప్పటికి కేవలం 526 మంది మాత్రమే రాజీనామా చేశారు. దీంతో ఎలాగైనా మిగిలిన వారిని సైతం రాజీనామా చేయించి తమ పార్టీ కార్యకర్తలుగా పని చేయించుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వలంటీర్ల సంఘాలు, ఐప్యాక్‌ బృందాలతో రాజీనామా చేయని వలంటీర్లపై ఒత్తిళ్లు కొనసాగిస్తున్నారు.

భవిష్యత్తు ఉండదని వలంటీర్లకు బెదిరింపులు

గ్రామ వలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల్లో వైసీపీ తరఫున ఓట్లు వేయించిన వారికి మాత్రమే జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత భవిష్యత్తు ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. రాజీనామాలు చేయని వలంటీర్ల భవిష్యత్తుకు గ్యారంటీ లేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్‌ తొలి సంతకం, తొలగించిన వలంటీర్ల కోసమే పెడతారని ప్రచారం చేస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం వలంటీర్లుగా వున్న వాళ్లంతా రాజీనామాలు చేసి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని, అలాగే పని చేసిన వలంటీర్లుకు దినసరి వేతనంతో పాటు ప్రత్యేక బహుమతులు ఇస్తామని పేర్కొంటున్నారు. వైసీపీ ప్రచారానికి దూరంగా, వలంటీర్‌ విధుల్లో వున్న వారి భవిష్యత్తు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని బెదిరింపుల సంకేతాలను పంపుతున్నారు.

అధికార పార్టీ బెదిరింపులకు స్పందించని వలంటీర్లు

రాజీనామాలు చేసి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు పని చేయాలని అధికార వైసీపీ ఎన్ని రకాల బెదిరింపులకు పాల్పడినా గ్రామ వలంటీర్ల నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 5,670 మంది వలంటీర్లు ఉంటే, కేవలం 526 మంది మాత్రమే రాజీనామాలు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని పలువురు వలంటీర్లు అంటున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదనే అనుమానంతో పాటు టీడీపీ అధికారంలోకి వస్తే నెల వేతనం పెరగడంతోపాటు మరింత ఆదాయం వస్తుందనే ఆశతో వలంటీర్లు ఉన్నారు. దీంతో ఎక్కువ మంది వలంటీర్లు తాము రాజీనామాలు చేయబోమని తెగేసి చెబుతుండడంతో ఐప్యాక్‌ బృందం సభ్యులు, వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. అయినప్పటికీ ఏదో మార్గంలో ప్రలోభ పెట్టో, భయపెట్టో వలంటీర్లను రాజీనామా చేయించి ఎన్నికల్లో తమకు అనుకూలంగా వాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులపై ఎన్నికల అధికారులు నిఘా పెట్టి అధికార వైసీపీ ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 01:24 AM