‘పశ్చిమ’ ఫలితం తేల్చేది వారే
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:48 AM
పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించేది పారిశ్రామిక ప్రాంత ఓటర్లే.
పారిశ్రామిక ప్రాంత ఓటర్లే కీలకం
నియోజకవర్గంలో ఉత్తరాది వారి ప్రాబల్యం
మల్కాపురం, ఏప్రిల్ 18:
పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించేది పారిశ్రామిక ప్రాంత ఓటర్లే. ఈ ప్రాంతంలో ఏడు వార్డులున్నాయి. సుమారు లక్షమందికి పైగానే ఓటర్లు ఉంటారు. ఉత్తర భారతదేశానికి చెందిన వారితో పాటు శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన ఓటర్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వీరు ఏవరి వైపు మొగ్గుచూపితే వారికే విజయావకాశాలు పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా ఈ ఓటర్లకు ఏ రాజకీయపార్టీతోనూ సంబంధాలు ఉండవు. పోలింగ్ రోజు ఓటు వేయడానికి మాత్రమే వస్తారు. నేవీ క్వార్టర్స్లో నివసించే ఓటర్లు సాధారణంగా బయటకు రారు. వీరిని పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ప్రతి ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున నాయకులు గట్టి ప్రయత్నాలే చేస్తుంటారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించదు. పైగా ఈ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవడానికి వీరు బయటకు రాకపోవడం కూడా కారణమే. తూర్పు నౌకాదళం ఉద్యోగులు, కోస్టు గార్డు ఉద్యోగులు, సింథియా, నౌసేనాబాగ్, యారాడ డాల్ఫిన్ హిల్, జై ఆంధ్ర కాలనీ, కాకరలోవ, క్రాంతినగర్, శ్రీహరిపురం ఎంఐజీ క్వార్టర్స్, ఆ పక్కనే ఉన్న కాలనీ, పిలకవానిపాలెం సమీప అన్నపూర్ణనగర్లో ఉత్తర భారతానికి చెందిన ఓటర్లున్నారు. మిగిలిన ప్రాంతాలలో శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా ప్రాంతాల వారున్నారు. వీరంతా ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఈ ఓటర్లంతా ఎటువైపు మొగ్గుచూపితే విజయం వారినే వరిస్తుంటుంది. అంతేకాకుండా హెచ్పీసీఎల్, కోరమాండల్, బ్లాక్ ఆయిల్ కంపెనీ, బీపీసీఎల్, ఏపీసీఎల్, భూగర్భంలో గ్యాస్, చమురు నిల్వల ప్రాజక్టుల్లో పనిచేస్తున్న వారు సుమారు 60 శాతం మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. వలస కూలీల సంఖ్య కూడా ఎక్కువే. పశ్చిమ నియోజకవర్గం డాక్యార్డు క్వార్టర్స్ (మేహాద్రిపేట) నుంచి జింక్ గేటు వరకు ఉంది. ఇక్కడ పోటీలోని అభ్యర్థులు విజయావకాశాలను నిర్ణయించే ఈ ఓటర్లపైనే ప్రత్యేకంగా దృష్టి సారించి, పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తుంటారు.