ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలి
ABN , Publish Date - Apr 28 , 2024 | 01:14 AM
సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎక్కువ ఉండేలా చూడాలని, దీనిపై ఓటర్లకు చైతన్యం కల్పించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు దల్జీత్సింగ్ మంగత్ సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీలు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
- జిల్లా ఎన్నికల పరిశీలకుడు దల్జీత్సింగ్ మంగత్
అనకాపల్లి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎక్కువ ఉండేలా చూడాలని, దీనిపై ఓటర్లకు చైతన్యం కల్పించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు దల్జీత్సింగ్ మంగత్ సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీలు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులున్నా రాజకీయ పార్టీల నాయకులు అధికారుల దృష్టికి తీసుకొస్తే సరి చేస్తారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో శబ్ధ కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్శెట్టి ఎన్నికల ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన భద్రతా చర్యలను వివరించారు. ఈ సమావేశంలో జనరల్ అబ్జర్వర్ డాక్టర్ రాకేశ్కుమార్, కె.మోహన్, ఎం.రహికర్, జేసీ జాహ్నవి, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బి.తాతయ్యబాబు, గొర్లె సూరిబాబు (వైసీపీ), జి.చిన్నారావు (బీఎస్పీ), కె.హరినాథబాబు (ఆమ్ఆద్మీ), అల్లు రాజు (సీపీఎం), వి.రమేశ్ (బీజేపీ) తదితరులు పాల్గొన్నారు.
కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్ల పరిశీలన
జిల్లా ఎన్నికల పరిశీలకుడు దల్జీత్సింగ్ మంగత్ శనివారం కలెక్టరేట్లో ఈవీఎంల గోదామును, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంల రిజిష్టర్లను ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట కలెక్టర్ రవి పట్టన్శెట్టి, ఎస్పీ కేవీ.మురళీకృష్ణ, జేసీ జాహ్నవి తదితరులు ఉన్నారు.