జీసీసీ లక్ష్యం రూ.60కోట్లు
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:33 PM
జీసీసీ ఈ ఆర్థిక సంవత్సరం(2024-25)లో వ్యాపార లక్ష్యం రూ.60 కోట్లుగా నిర్ణయించామని జీసీసీ డివిజనల్ మేనేజర్ ఉరిటి మహేంద్రకుమార్ తెలిపారు.
సాలూరు రూరల్: జీసీసీ ఈ ఆర్థిక సంవత్సరం(2024-25)లో వ్యాపార లక్ష్యం రూ.60 కోట్లుగా నిర్ణయించామని జీసీసీ డివిజనల్ మేనేజర్ ఉరిటి మహేంద్రకుమార్ తెలిపారు. ఆయన సాలూరు జీసీసీ కార్యాలయంలో సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రపురం, మెంటాడ మండలాల సేల్స్మెన్లు, సిబ్బందితో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో జీసీసీ పార్వతీపురం మన్యం జిల్లాలో దాదాపు రూ.60 కోట్లు వ్యాపార లక్ష్యాన్ని చేరుకుందన్నారు. ఈ ఏడాది రూ.60 కోట్లు లక్ష్యంగా నిర్ణయించినా అంతకు మించి సాధించడానికి సిబ్బంది కృతనిశ్చయంతో పనిచేయాలన్నారు. జీసీసీ సిబ్బంది ఎటువంటి అవకతవకలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవన్నారు. సాలూరులో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్ ఇన్చార్జి సీహెచ్ రాములను వివరాలడిగి తెలుసుకున్నారు. మండలాల మ్యాపింగ్ మారడం వల్ల సాలూరు నుంచే పాచిపెంట, మక్కువలకు సరుకులు పంపించడంలో సమస్య ఏర్పడుతుందని రాములు వివరించారు. ఈ సమస్యను డీఎస్వో దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. ఈనెల 30 నాటికి సరుకులు డిపోలకు చేరేటట్టు శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆయనతో జీసీసీ సాలూరు మేనేజర్ జె.రామారావు తదితరులున్నారు.