కుక్కల దాడిలో మరో ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:11 AM
మండలం లో మరోసారి కుక్కలు దాడికి తెగబడ్డాయి.
జియ్యమ్మవలస: మండలం లో మరోసారి కుక్కలు దాడికి తెగబడ్డాయి. గత రెండు నెలల్లో ఇదే మండలంలో 13మంది కుక్కకాటుకు గురయ్యారు. మళ్లీ శనివారం గవరమ్మపేట పంచాయతీ వెంకటరాజపురం గ్రామంలో ఇద్దరిపై వేర్వేరుగా కుక్కలు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాయి. గ్రామానికి చెందిన గొడబ సరోజని ఉదయం ఉపాధి పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న సరోజని బహిర్భూమికి అని ఇంటికి దగ్గర్లో ఉన్న మిరప తోటకు వెళ్లింది. ఇది చూసిన కుక్కలు ఆమెపై మెరుపు వేగంతో దాడి చేశాయి. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు చినమేరంగి లో ఉన్న సీహెచ్సీకి తీసుకువచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే అలజందగి మహేశ్వరి అనే డిగ్రీ విద్యార్థిని ఇంటి నుంచి బయటకు వస్తుండగా కుక్కలు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాయి. తల్లిదండ్రు లు ఆమెను చినమేరంగి సీహెచ్సీకి తరలించగా అక్కడి వైద్యులు చికిత్స అందించారు. వరుస ఘటనలతో పరిసర ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కుక్కలను శాశ్వతంగా నిర్మూలించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.