ఎన్నికల ఖర్చంతా వీఆర్వోలపైనే
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:23 AM
చాలాచోట్ల వీఆర్వోలు, బీఎల్వోలుగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వీరంతా రూ.లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
అప్పు చేసి ఖర్చులు భరిస్తున్నాం..
ఎన్నికలయ్యాక చేతికందని నగదు
గత ఎన్నికల్లో పరిస్థితి ఇదే..
ఆదుకోవాలంటూ ఈసీకి విజ్ఞప్తి
ఏలూరు రూరల్, ఏప్రిల్ 27: సాధారణంగా ఎన్నికల ఖర్చుకు సంబంధించిన డబ్బును, ఆర్వోలు, వీఆర్వోలు, ఏఈఆర్వోలు విడుదల చేస్తుంటారు. ఆర్వోల నుంచి ఏఈఆర్వోలు, వీఆర్వోలకు సొమ్ము విడుదలవుతుంటుంది. వీరిలో సాధారణంగా తహసీల్దార్లే ఉంటారు. తహసీల్దార్లు తిరిగి ఆర్ఐలకు పనులు పురమాయిస్తారు. ఆర్ఐలు ఆ పనులను వీఆర్వోలపై పెడతారు. అంతిమంగా ఆ ఖర్చు వీఆర్వోల మెడకు చుట్టుకుంటుంది. చాలాచోట్ల వీఆర్వోలు, బీఎల్వోలుగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వీరంతా రూ.లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి నిధులు ఏమీ రాకపోవడంతో ఎన్నికలు అయ్యే వరకు ఓపిక పట్టాలని, అప్పులు ఇచ్చిన వారిని బతిమిలాడుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమయ్యే స్టేషనరీ, పేపర్ బండిల్స్, దరఖాస్తులు, ప్రింటింగ్ కాపీలు, ఎలక్టోరల్ రోల్స్, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ర్యాంపులు, కేంద్రాల్లో పరిశుభ్రత..ఇవన్నీ వీఆర్వోలే చూసుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి, ఆర్వోలు వస్తే ప్రొటోకాల్ ప్రకారం వారి ఖర్చులన్నీ భరించాలి. పోలింగ్ సమయంలో భారీగా ఖర్చు ఉంటుంది. ఒక్కో మండలానికి సగటున 60 పోలింగ్ కేంద్రాలు ఉంటాయనుకుంటే ఒక్కో కేంద్రానికి 12 మంది సిబ్బంది ఉంటారు. అన్ని పోలింగ్ స్టేషన్లకు అల్పాహారం, భోజనాలు, స్నాక్స్, మజ్జిగ వంటివి ఏర్పాటు చేయాలి. డిస్ర్టిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలకు చేరుకునే సిబ్బందికి అల్పాహారాలు, భోజనాలు పెట్టాలి. ఇలా లక్షల రూపా యలను ఖర్చుచేసినా చివరకు ఆ డబ్బు చేతికి అందక వీఆర్వోలు ప్రతి ఎన్నికల్లో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంలో ఇతర జిల్లాల తహసీల్దార్లు బదిలీపై వస్తుంటారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన డబ్బు వీరు తీసుకు వెళ్ళిపోతూ ఉండటంతో వీఆర్వోలు నిండా మునిగి పోతున్నారు. గత ఎన్నికల్లోనూ ఇదేతంతు జరిగింది. ఎన్నికల్లో ఎవరైతే డబ్బు ఖర్చుపెడతారో వారికే ఎన్నికల సంఘం డబ్బులు ఇవ్వాలని వీఆర్వోలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పడిన ఇబ్బందులు, ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను వీఆర్వోల సంఘ నాయకులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు.
బీఎల్వోలకు గౌరవ వేతనం లేదు
–భూపతిరాజు రవీంద్రరాజు రాష్ట్ర వీఆర్వోల సంఘం అధ్యక్షుడు
ప్రస్తుతం పనిచేస్తున్న గత బీఎల్వోలకు గత రెండేళ్ల నుంచి గౌరవ వేతనం ఇవ్వలేదు. ఆ నిధులు తక్షణం విడుదల చేయాలి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఉద్యోగు లంతా ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిం చాలి. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు అందరికి ఆ నియోజకవర్గంలో ఓటుహక్కు వినియోగానికి రిటర్నింగ్ అధికారి పరిధిలో చర్యలు తీసుకోవాలి.