ప్రజలు స్వేచ్ఛగా ఓటెయ్యాలి
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:23 PM
నిబంధనలకు అనుగుణంగా పాదర్శకత, నిష్పక్షపాతంతో ఎన్నికల విధులు నిర్వహించాలని స్పెషల్ జనరల్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ శైలేష్ కుమార్ సిన్హా అన్నారు.
ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ శైలేష్ కుమార్ సిన్హా
భీమవరం క్రైం, ఏప్రిల్ 25 : నిబంధనలకు అనుగుణంగా పాదర్శకత, నిష్పక్షపాతంతో ఎన్నికల విధులు నిర్వహించాలని స్పెషల్ జనరల్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ శైలేష్ కుమార్ సిన్హా అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లా పోలీస్శాఖ తీసుకుంటున్న ముందస్తు చర్యలను కొనియాడారు. జిల్లాలో చేపట్టిన చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్పీ వివరించారు. ప్రజలు తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురి కావల్సి వస్తుందని హెచ్చరించారు. ఈవీఎంల రవాణా, భద్రతా విషయాలు, సిబ్బందికి సదుపాయాలు, ఇతర విషయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) భీమారావు, డీఎస్పీలు మూర్తి, నారాయణస్వామిరెడ్డి, శ్రీనివాసరావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆర్మ్డ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎం.సత్యనారాయణ, సెబ్ డీఎస్పీ వెంకట నారాయణ, దిశా డీఎస్పీ నున్న మురళీకృష్ణ, సీసీఎస్ యుగంధర్బాబు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐ తిలక్, సీఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.