Share News

22న మోదీతో మస్క్‌ భేటీ!

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:31 AM

ఈ నెల 21న భారత్‌కు రానున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. ఆ మరుసటి రోజున (22) ప్రధాని మోదీతో భేటీ కానున్నారని సీనియర్‌ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. అనంతరం తన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా భారత ప్రవేశంపై...

22న మోదీతో మస్క్‌ భేటీ!

అనంతరం టెస్లా ఎంట్రీపైౖ ప్రకటన

న్యూఢిల్లీ: ఈ నెల 21న భారత్‌కు రానున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. ఆ మరుసటి రోజున (22) ప్రధాని మోదీతో భేటీ కానున్నారని సీనియర్‌ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. అనంతరం తన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా భారత ప్రవేశంపై మస్క్‌ అధికారిక ప్రకటన చేయవచ్చన్నారు. అయితే, టెస్లా ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నదన్న విషయంపై స్పష్టత రాకపోవచ్చన్నారు. ఎందుకంటే, ఈ విషయాన్ని ప్రకటించేందుకు టెస్లా బోర్డు అనుమతి అవసరం. అది ఇప్పటికిప్పుడే సాధ్యపడకపోవచ్చని సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.

టెస్లా వంటి అంతర్జాతీయ ఈవీ కంపెనీలకు మార్గం సుగమం చేసేందుకు గత నెలలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని ప్రకటించింది. కనీసం 50 కోట్ల డాలర్ల (సుమారు రూ.4,150 కోట్లు) పెట్టుబడితో భారత్‌లో ఈవీల ప్లాంట్‌ను ఏర్పాటు చేసే గ్లోబల్‌ కంపెనీలకు ప్రభుత్వం దిగుమతి సుంకం రాయితీలు కల్పించనుంది. కంపెనీకి అనుమతి మంజూరు చేసిన తేదీ నుంచి ఐదేళ్ల వరకు 35,000 డాలర్లు (రూ.29 లక్షలు) అంతకు పైగా విలువ చేసే కార్లను 15 శాతం కస్టమ్స్‌ సుంకం చెల్లించి దిగుమతి చేసుకునేందుకు అనుమతించనున్నారు. ప్రస్తుతం కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్‌ (సీబీయూ) కార్ల దిగుమతిపై చెల్లించాల్సిన కస్టమ్స్‌ సుంకం.. ఇంజన్‌ సైజు, ధర, బీమా, రవాణా విలువ ఆధారంగా 70-100 శాతం స్థాయిలో ఉంది.

పరిశీలనలో స్టార్‌లింక్‌ దరఖాస్తు

టెస్లాతో పాటు తన శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సర్వీస్‌ కంపెనీ స్టార్‌లింక్‌ సేవల ప్రారంభంపైనా మస్క్‌ ప్రకటన చేయవచ్చన్న అంచనాలున్నాయి. భారత్‌లో శాట్‌కామ్‌ సేవలను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ స్టార్‌లింక్‌ సమర్పించిన దరఖాస్తు ప్రస్తుతం పరిశీలన దశలో ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కంపెనీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో పాటు ఇతర ఆర్థిక ప్రతిపాదనలు టెలికాం, సమాచార సేవల శాఖ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ప్రస్తుతం భద్రత పరమైన అంశంపై గృహ మంత్రిత్వ శాఖ సమీక్ష జరుగుతోందన్నారు. మస్క్‌ భారత పర్యటనకు ముందే (ఈ వారాంతంలోగా) స్టార్‌లింక్‌కు అనుమతి మంజూరు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. మళ్లీ ఎన్‌డీయేనే అధికారం రావచ్చన్న అంచనాలున్న నేపథ్యంలో మస్క్‌ భారత పర్యటన రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.

‘టాటా’తో టెస్లా డీల్‌

సెమీకండక్టర్ల (చిప్‌లు) సమీకరణ కోసం టాటా ఎలకా్ట్రనిక్స్‌తో టెస్లా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ రెండు కంపెనీల మధ్య ఒప్పందం కొన్ని నెలల క్రితమే జరిగిందని, టెస్లా తన సరఫరాదారుల వివరాలను రహస్యంగా ఉంచుతుందని ఓ ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది. కొవిడ్‌ సంక్షోభం తర్వాత కార్ల తయారీకి అవసరమైన విడిభాగాలు, ఇతర పరికరాల సమీకరణ విషయంలో టెస్లా వ్యూహన్ని మార్చుకుంది. కేవలం చైనాపైనే ఆధారపడకుండా ఇతర దేశాల కంపెనీల నుంచీ వీటిని సమీకరిస్తోంది.

అందులో భాగంగానే టాటా ఎలకా్ట్రనిక్స్‌తో ఒప్పందం జరిగినట్లు సమాచారం. కాగా, టెస్లాకు భారత్‌లో ఇప్పటికే కనీసం 8 మంది సరఫరాదారులున్నారని, సంవర్ధన మదర్సన్‌ ఇంటర్నేషనల్‌, సుప్రజిత్‌ ఇంజనీరింగ్‌, సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్‌ ఫోర్జింగ్స్‌, వర్రోక్‌ ఇంజనీరింగ్‌, బాష్‌ లిమిటెడ్‌, హిండాల్కో ఇండస్ట్రీస్‌, గుడ్‌లక్‌ ఇండియా, వాలియంట్‌ కమ్యూనికేషన్స్‌ ఈ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. భారత సరఫరాదారుల నుంచి టెస్లా ఏటా 100-200 కోట్ల డాలర్ల విలువైన వాహన పరికరాలు, ఇతర ఉత్పత్తులను సేకరిస్తోందన్న అంచనాలున్నాయి.

Updated Date - Apr 17 , 2024 | 02:31 AM