Share News

Delhi: త్వరలో భారత్‌లోకి ఎయిర్‌ట్యాక్సీలు.. 32 కి.మీ.ల ప్రయాణం 7 నిమిషాల్లో

ABN , Publish Date - Apr 19 , 2024 | 07:58 PM

భారత్‌లో 2025లో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటి సాయంతో దేశ రాజధానిలోని కన్నాట్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్‌కు కేవలం 7 నిమిషాల్లో ప్రయాణికులను తీసుకువెళ్తుంది. అంటే ట్రాఫిక్ జామ్‌లకు ఫుల్ స్టాప్ పడినట్లే.

Delhi: త్వరలో భారత్‌లోకి ఎయిర్‌ట్యాక్సీలు.. 32 కి.మీ.ల ప్రయాణం 7 నిమిషాల్లో

ఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రస్తుతం ప్రధానంగా వేధిస్తున్న సమస్య ట్రాఫిక్(Traffic). నిమిషాల వ్యవధిలో ఆఫీసులకు చేరుకోవాల్సింది.. కొన్నిసార్లు గంటల సమయం పట్టవచ్చు. ఇది క్రమంగా విస్తరిస్తున్న నగరాలకు పెద్ద సమస్యగా మారింది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు ఎన్ని కట్టినా సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. 2030 నాటికి ఈ సమస్య మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టడానికి ఓ వినూత్న ఆలోచనతో వచ్చింది ఆర్చర్ ఏవియేషన్ అనే కంపెనీ. అందుకోసం ఎయిర్ ట్యాక్సీలను రంగంలోకి దించబోతోంది. అవునండీ.. మున్ముందు మనం గాలిలో ఎగరబోతున్నాం. అదేంటీ ఆల్రెడీ విమానాలు, హెలికాప్టర్లలో గాలిలో ప్రయాణిస్తున్నాం కదా, ఈ ఎయిర్ ట్యాక్సీలేంటి. అనుకుంటున్నారా.. ఎయిర్ ట్యాక్సీలు(Air Taxy) కంప్లీట్ డిఫరెంట్. 5 మందితో ఈ ట్యాక్సీల్లో ఎక్కడికైనా ప్రయాణించొచ్చు. త్వరలో భారత్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టాలని చూస్తున్నారు.


దీంట్లో దేశ రాజధానిలోని కన్నాట్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్‌కు కేవలం 7 నిమిషాల్లో ప్రయాణికులను తీసుకువెళ్తుంది. భారత్‌లోని అగ్రశ్రేణి విమానయాన సంస్థ ఇండిగోకు(Indigo) మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్(Archer Aviation)... 2026లో భారత్‌లో ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీస్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఆర్చర్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు, CEO ఆడమ్ గోల్డ్‌స్టెయిన్ శుక్రవారం మాట్లాడుతూ.. యుఎస్ రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ)తో చర్చలు జరుగుతున్నాయని, ఎయిర్ ట్యాక్సీ ధ్రువీకరణ ప్రక్రియ కీలక దశలో ఉందని చెప్పారు. సర్టిఫికేషన్ 2025లో వచ్చే అవకాశం ఉందని.. అది అమల్లోకి వచ్చిన తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సర్టిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు.


రానున్న రోజుల్లో భారత్‌లో ఎయిర్ ట్యాక్సీల తయారీని కంపెనీ పరిశీలిస్తుందా అనే ప్రశ్నకు గోల్డ్‌స్టెయిన్ సానుకూలంగా స్పందించారు. తొలుత ఆర్చర్ ఏవియేషన్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలపై దృష్టి సారిస్తుంది.ఢిల్లీలోని కన్నాట్ నుంచి గురుగ్రామ్ వరకు రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు ఛార్జ్ చేస్తుంది.

భూమిపై 32 కి.మీ.ల ప్రయాణానికి 90 నిమిషాలు పడితే ఎయిర్ ట్యాక్సీ ద్వారా కేవలం 7 నిమిషాల్లో చేరుకోవచ్చట. ఊహించుకుంటేనే గాలిలో తేలినట్టుంది కదా. 'మిడ్‌నైట్' ఈ-ఎయిర్‌క్రాఫ్ట్‌(e-Aircraft)లు నలుగురు ప్రయాణికులతో సహా పైలట్‌ను 100 మైళ్ల(161 కి.మీ.ల) వరకు తీసుకెళ్లగలవు. రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు పొందితే ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్న నగరాలు, కాలుష్యంతో పోరాడుతున్న ప్రాంతాల్లో మెరుగైన రవాణాను అందించే లక్ష్యంతో ఇవి పని చేయనున్నాయి.


క్రిస్లర్-పేరెంట్ స్టెల్లాంటిస్, బోయింగ్,యునైటెడ్ ఎయిర్‌లైన్స్ మద్దతుతో, ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) విమానాలను ఆర్చర్ ఏవియేషన్ తయారు చేసింది. తొలుత 200 ట్యాక్సీ సేవల్ని ఢిల్లీ(Delhi), ముంబయి(Mumbai), బెంగళూరు(Bengaluru)లో ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రయాణికులను తరలించడానికే కాకుండా.. 38 శాతం ట్యాక్సీలను కార్గో, లాజిస్టిక్స్, మెడికల్, ఎమర్జెన్సీ, చార్టర్ సేవల కోసం ఉపయోగించాలని భావిస్తోంది. ఆర్చర్ ఆరు మిడ్‌నైట్ విమానాలను యూఎస్ కి అందించడానికి ఆ దేశ వైమానిక దళం నుంచి142 మిలియన్ల డాలర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2023లో అక్టోబర్‌లో UAEలో ఎయిర్ టాక్సీ సేవను ప్రారంభించింది.

ఇవికూడా చదవండి:

టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..

బస్సు లోపల్నుంచే జగన్ షో!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 19 , 2024 | 08:03 PM