Supreme Court: ఈవీఎంలపై సందేహాలు లేవు అన్ని సందేహాలనూ ఈసీ నివృత్తి చేసింది
ABN , Publish Date - Apr 25 , 2024 | 04:41 AM
ఈవీఎంలపై అన్ని సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేసినందువల్ల మళ్లీ బ్యాలట్ పేపర్ పద్దతికి తిరిగి వెళ్లే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అనుమానాలపై ఆదేశాలు జారీ చేయలేం
ఎన్నికల ప్రక్రియను మేము నియంత్రించలేం
మళ్లీ బ్యాలట్ పద్ధతికి వెళ్లే ప్రసక్తి లేదు: సుప్రీం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఈవీఎంలపై అన్ని సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేసినందువల్ల మళ్లీ బ్యాలట్ పేపర్ పద్దతికి తిరిగి వెళ్లే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈవీఎంలలో పోలైన ఓట్లతో.. వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తహాడ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఎన్నికలను నియంత్రించలేదని.. ఒక రాజ్యాంగ సంస్థ (ఎన్నికల సంఘం)పై పెత్తనం చలాయించే అథారిటీగా వ్యవహరించలేదని స్పష్టం చేసింది.
ఈవీఎంల పనితీరుపై ఐదు ప్రధాన ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ నుంచి వివరణలను రాబట్టి.. ఇరువర్గాల వాదోపవాదాలనూ విన్న అనంతరం కోర్టు ఈ అభిప్రాయానికి వచ్చింది. కేవలం అనుమానం ఆధారంగా ఆదేశాలు జారీ చేయలేమని.. హ్యాకింగ్ జరిగిన ఉదంతాలు లేవని పిటిషనర్ ఉటంకించిన నివేదికే స్పష్టం చేసిందని వ్యాఖ్యానించింది. 5 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను ఈవీఏంలతో పోల్చి చూడాలంటూ గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎన్నికల కమిషన్ అమలు చేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. ఇంకా ఏదైనా దుర్వినియోగం జరిగినట్లు ఏ అభ్యర్థి అయినా ఫిర్యాదు చేస్తే అప్పుడు చూద్దామని తెలిపింది. ఈవీఎంల వ్యవస్థనే పటిష్ఠం చేసేందుకు ఆదేశాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంటూ తీర్పును వాయిదా వేసింది.
ఏ సాఫ్ట్వేరూ ఉండదు..
ఈవీఎంలలో ఒక కంట్రోల్ యూనిట్, ఒక బ్యాలెటింగ్ యూనిట్ ఉంటాయి. ఈ రెండింటినీ అనుసంధానిస్తూ ఒక కేబుల్ ఉంటుంది. ఈ రెండూ వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) యంత్రానికి అనుసంధానమై ఉంటాయి. మనం వేసిన గుర్తుకే ఓటు పడిందీ లేనిదీ ఈ వీవీప్యాట్ యంత్రం ద్వారా తెలుసుకోవచ్చు.
బుధవారం విచారణ ప్రారంభం కాగానే.. ఈ మూడు యూనిట్లపై తమకున్న సందేహాలను ధర్మాసనం ఈసీ ముందు పెట్టింది. వాటిలోని మైక్రో కంట్రోలర్ల గురించి వివరణ కోరింది. వాటిని ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్ చేయగలమా? లేక రీ-ప్రోగ్రామింగ్ చేసే వీలుందా? అని ప్రశ్నించింది. దీనికి ఈసీ.. మూడు యూనిట్లలోనూ వేర్వేరు మైక్రో కంట్రోలర్లు ఉంటాయని, వాటిని ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్ చేసే వీలుంటుందని కోర్టుకు తెలిపింది. కానీ, ఆ వాదనను పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తోసిపుచ్చారు.
ఈవీఎంల మైక్రో కంట్రోల్ యూనిట్ల ఫ్లాష్ మెమొరీలను మళ్లీ ప్రోగ్రామింగ్ చేయవచ్చని వాదించారు. అయితే, ఆయన అభిప్రాయంతో కోర్టు ఏకీభవించలేదు. వీవీపాట్లలోని ఫ్లాష్ మెమొరీలో ఏ సాఫ్ట్వేరూ ఉండదని, కేవలం 1024 వరకూ ఎన్నికల గుర్తులనే లోడ్ చేయగలరని, దాని మెమొరీయే తక్కువ స్థాయిలో ఉంటుందని ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను గుర్తుచేసింది.
ఈసీ ఇచ్చిన సాంకేతిక నివేదికను విశ్వసించాలని స్పష్టం చేసింది. ‘‘మీరు ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఆలోచిస్తే దానికి మేమేం చేయలేం. మీ ఆలోచనా ధోరణిని మేం మార్చలేం’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.