దేశం, ధర్మ రక్షణ కోసం బీజేపీ పోరాటం
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:33 AM
దేశం కోసం, ధర్మ రక్షణ కోసం బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. బుధవారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్కు చెందిన నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
చొప్పదండి, ఏప్రిల్ 24: దేశం కోసం, ధర్మ రక్షణ కోసం బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. బుధవారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్కు చెందిన నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం ధర్మం కోసం మాట్లాడితే తనను కించపరిచేలా మాట్లాడుతున్నారని, బీజేపీ ప్రజల కోసం ఎల్లవేళలా దేశంకోసం ధర్మం, కోసం ముందుంటుందన్నారు. దేవుడి మీద ఒట్టేసి కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని కాంగ్రెస్ నాయకులు తనను ఓడిస్తానని గొప్పలు చెప్పుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఇక్కడున్న మంత్రి పార్టీకి, సీఎంకు చెప్పకుండా రాజేందర్తో నామినేషన్ వేయించాడని, ఈ విషయం తెలిసి కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసిందని తనకు సమాచారం ఉందన్నారు. ఈ రోజు అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి తరుపున నామినేషన్ వేశారని, రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తున్నా ఇంకా అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని కాంగ్రెస్ నాయకులు తనను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలివ్వక పోతే అవి నెరవేర్చేదాకా కొట్లేడే ఏకైక పార్టీ బీజేపీమాత్రమే అన్నారు. ఫాం హౌస్లో పడుకున్న కేసీఆర్ను ధర్నా చౌక్కు గుంజుకొచ్చాననే అక్కసుతో తనను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. మోదీ ఇళ్ల కోసం నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లించాడని విమర్శించారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచితంగా బియ్యం వస్తుంటే కేసీఆర్ బొమ్మలు పెట్టుకున్నారన్నారు. మోదీని విమర్శిస్తున్న కాంగ్రెస్ మంత్రి ఆనాడు ఎందుకు కేసీఆర్పై పోరాటం చేయలేదని ప్రశ్నించారు. ప్రజలు అల్లాడుతుంటే పది సంవత్సరాలు ఎక్కడికి పోయారన్నారు. మోదీ చేసిన అభివృద్ధి పనులన్నీ మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 57 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ బాత్రూంలు కూడా కట్టివ్వకుండా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేదన్నారు. చొప్పదండికి వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్కుమార్కు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు, ముదిరాజ్ సంఘం మందశ్రీరాం ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్లమెంట్ కన్వినర్ బోయినపల్లి ప్రవీణ్రావు, జిల్లా కార్యదర్శి చేవూరి సత్యనారాయణ, అసెంబ్లీ కన్వినర్ పెరుక శ్రావణ్, అసెంబ్లీ ప్రబరి రాజేష్, మేకల ప్రభాకర్యాదవ్, రాజన్నల రాజు, పట్టణ ప్రధానకార్యదర్శిచిల్ల శ్రావణ్, అనుకారి సాయికృష్ణ, చల్ల అనూష్, జిట్ట కుమార్, బొడిగె సురేష్, తాడూరి రామక్రిష్ణ, సుధాకర్, గుండేటి శివకృష్ణ, రాజేందర్, శ్రావణ్, మధు పాల్గొన్నారు.