బకాయిలు వెంటనే చెల్లించాలి
ABN , First Publish Date - 2022-08-11T04:18:12+05:30 IST
ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
రాయచోటి (కలెక్టరేట్), ఆగస్టు10: ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు 26 జిల్లాల్లో సబ్ ట్రెజరీ కార్యాలయాల కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా అన్నమయ్య జిల్లాలో కూడా ఈ ధర్నా నిర్వహించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జడ్పీ పీఎఫ్ రుణ బకాయిలు రిటైర్డ్, మెచ్యూరిటీ బకాయిలు, ఉద్యోగుల సరెండర్ లీవులకు సంబంధించిన బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని వారు ఆరోపించారు. మెడికల్ రీయంబర్మెంట్ బకాయిలు కూడా చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు ఉద్యోగులను గురి చేస్తోందని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత వారి పిల్లలకు వివాహాలు కూడా చేయలేని స్థితిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, మూడు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం తీరు ఇలాగే ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఎస్టీయూ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ జీవో నెంబరు 117, 128లను ప్రభుత్వం ఉపసంహరించుకుని తరగతుల విలీనం విషయంపై పునరాలోచించాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల వారు జిల్లా ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజగోపాల్రెడ్డి, రవీంద్రనాథరెడ్డి, నరసింహులు, వేణుగోపాల్రెడ్డి, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.