ఉపాధ్యాయ సమస్యలపై రేపటి నుంచి నిరసన
ABN , First Publish Date - 2021-10-18T04:50:17+05:30 IST
ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల 19వ తేదీ నుంచి విజయవాడలో ఆరు రోజుల పాటు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ తెలిపారు. స్థానిక ఏపీటీఎఫ్ భవనంలో శనివారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
విజయవాడలో ఆరు రోజుల పాటు నిర్వహణ
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాలకపాటి రఘువర్మ
అనకాపల్లిటౌన్, అక్టోబరు 17: ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల 19వ తేదీ నుంచి విజయవాడలో ఆరు రోజుల పాటు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ తెలిపారు. స్థానిక ఏపీటీఎఫ్ భవనంలో శనివారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ ప్రగతి, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు తదితర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నిరవధిక ధర్నాలు చేపట్టనున్నామన్నారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే నవంబరు రెండో తేదీన ఉపాధ్యాయులతో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీటీఎఫ్ మండలశాఖ అధ్యక్ష, కార్యదర్శులు కేవీఎల్గణేశ్, డి.నూకేశ్వరరావు, ఉపాధ్యాయ పత్రికా సంపాదకులు శీలా జగన్నాథరావు, నాయుడు, శ్రీనివాస్, కన్నారావు తదితరులు పాల్గొన్నారు.