తెలంగాణకు పతకం సాధించిపెట్టాలి
ABN , First Publish Date - 2022-09-30T05:29:23+05:30 IST
గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ర్టానికి పతకం సాధించి పెట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.
- మహేందర్ను అభినందించిన మంత్రి గంగుల
కరీంనగర్ స్పోర్ట్స్, సెప్టెంబరు 29: గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ర్టానికి పతకం సాధించి పెట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. 36వ జాతీయ క్రీడల్లో భాగంగా రాష్ట్ర జూడో జట్టుకు కోచ్కం మేనేజర్గా ఎంపికకావడమే కాకుండా జాతీయ క్రీడల్లో ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొంటున్న సిలివేరి మహేందర్ను ఆయన గురువారం అంబేద్కర్ స్టేడియంలో అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర జట్టు క్రీడాకారులు పతకాలు సాధించే దిశగా ట్రైనింగ్ చేయాలన్నారు. జూడోలో జిల్లాకు ఘనమైన కీర్తి ఉందన్నారు. జాతీయ క్రీడల్లో సత్తాచాటి పతకంతో తిరిగి రావాలని సూచించారు. మహేందర్ను కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు, జిల్లా ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తుమ్మల రమేశ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బేస్బాల్ సంఘం అధ్యక్షుడు చల్ల హరిశంకర్లతోపాటు పలువురు అభినందించారు.