నినదించే గొంతులు నిర్బంధం
ABN , First Publish Date - 2022-01-21T06:18:27+05:30 IST
పీఆర్సీ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి ఆర్డీవో, సబ్ కలెక్టర్ కార్యాలయాల ముందు ఉపాధ్యాయ సంఘాలు గురువారం పెద్ద ఎత్తున ఆందో ళనలు చేపట్టాయి.
విశాఖ వెళ్లనీయకుండా పలు చోట్ల ఉపాధ్యాయ సంఘాల నేతల హౌస్ అరెస్టు
జాక్టో పిలుపు మేరకు నర్సీపట్నం ఆర్డీవో, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు
పీఆర్సీ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్
నర్సీపట్నం, జనవరి 20 : పీఆర్సీ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి ఆర్డీవో, సబ్ కలెక్టర్ కార్యాలయాల ముందు ఉపాధ్యాయ సంఘాలు గురువారం పెద్ద ఎత్తున ఆందో ళనలు చేపట్టాయి. జాక్టో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నర్సీపట్నంలో ఆందోళన కార్యక్రమాలను పోలీసులు భగ్నం చేసేం దుకు యత్నించారు. గురువారం ఉదయం జాక్టో ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వేసిన ధర్నా శిబిరాన్ని పోలీసులు బలవంతంగా తొలగించారు. దీంతో ప్ల కార్డులతో పాల్ఘాట్ కూడలి వద్ద రాస్తోరోకో జరిపి, మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ పెద్దపెట్టున నినదించారు. అంతకు ముందు జాక్టో జిల్లా చైర్మన్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డీజీ నాథ్ను శారదానగర్లో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తర్వాత ఆయన పోలీసుల అనుమతితో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రాస్తారోకోకు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు అడిగర్ల వరహాలనాయుడు, అల్లు అప్పారావు, జీపీఎస్ నాయుడు, సుగుణ, పీఏ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా విశాఖ లోని కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనకు ఫ్యాప్టో నాయకులను వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో డివిజన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావును శివపురంలోని ఆయన ఇంట్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్భంధం చేశారు.