కోరం లేక జడ్పీ సమావేశం నిరవధిక వాయిదా
ABN , First Publish Date - 2022-08-19T05:43:45+05:30 IST
కోరం లేకపోవడంతో జడ్పీ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు జడ్పీ సీఈవో సీహెచ్ కృష్ణారెడ్డి ప్రకటించారు.
రెండో రోజూ హాజరుకాని సభ్యులు
కోరం లేదని వాయిదా వేసిన సీఈవో
జడ్పీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ జడ్పీటీసీల ధర్నా
భువనగిరి రూరల్, ఆగస్టు 18 : కోరం లేకపోవడంతో జడ్పీ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు జడ్పీ సీఈవో సీహెచ్ కృష్ణారెడ్డి ప్రకటించారు. బుధవారం నిర్వహించాల్సిన సమావేశాన్ని గురువారానికి వాయిదా వేసినా మెజార్టీ సభ్యులు హాజరుకాలేదు. దీంతో నిరవధికంగా వాయిదా వేశారు. సమావేశానికి కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కుడుదుల నగేశ్, ఆత్మకూర్(ఎం), వలిగొండ జడ్పీటీసీలు కొడిత్యాల నరేందర్ గుప్తా, వాకిటి పద్మ అనంతరెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి 10.30గంటలకే హాజరయ్యారు. కాగా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీ్పరెడ్డి, మెజార్టీ సభ్యులు హాజరు కాలేదు. అయితే జడ్పీ సీఈవో సీహెచ్ కృష్ణారెడ్డి ఉదయం 11.30గంటలకు సమావేశ హాల్లోకి ప్రవేశించి కోరం లేనందున సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశానికి పూర్తిస్థాయిలో జిల్లా అధికారులు హాజరు కాకపోవడం గమనార్హం. స్థాయి సంఘం సమావేశాలతో పాటు సర్వసభ్య సమావేశాలు మొక్కుబడిగా కొనసాగుతుండడంతో అభివృద్ధి కుంటుపడి తాము గ్రామాల్లో పర్యటించలేకపోతున్నామని డాక్టర్ నగేశ్తో పాటు పలువురు సభ్యులు తెలిపారు.
ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరు: కాంగ్రెస్
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఇన్చార్జీలుగా నియమించబడిన జడ్పీ చైర్మన్తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటున్నారు. మూడు నెలలకోసారి జరిగే జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగా గైర్హాజరై వాయిదా వేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదుల నగేశ్ ఆరోపించారు. జడ్పీ సమావేశం వాయిదా పడిన అనంతరం కార్యాలయం ఎదుట వలిగొండ, ఆత్మకూర్ (ఎం) జడ్పీటీసీలు నరేందర్ గుప్తా, వాకిటి పద్మఅనంతరెడ్డి, ఆత్మకూర్ ఎంపీపీ మంగమ్మ, ఖప్రాయపల్లి ఎంపీటీసీ సభ్యుడు మర్యాల వెంకటేశంతో కలిసి ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడని స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలన్నారు.