ఒడిశాలో ఆదివారం నుంచి రాత్రి కర్ఫ్యూ
ABN , First Publish Date - 2021-04-04T01:01:33+05:30 IST
కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఏప్రిల్ 5 నుంచి 10 జిల్లాల్లో
భువనేశ్వర్ : కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఏప్రిల్ 5 నుంచి 10 జిల్లాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. సుందర్గఢ్, జార్సుగూడ, సంబల్పూర్, బార్గఢ్, బొలంగీర్, నౌపడ, కలహండి, నవరంగపూర్, కోరాపుట్, మల్కన్గిరి జిల్లాల్లో కర్ఫ్యూ అమలవుతుందని తెలిపింది.
ప్రజాహితం కోసం, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నట్లు వివరించింది. కర్ఫ్యూ సమయంలో అన్ని దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. ప్రజలు ఈ సమయంలో బయటకు రాకూడదని తెలిపింది. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ఉందని పేర్కొంది. జిల్లా, నగరపాలక, పురపాలక సంఘాల పరిపాలనా యంత్రాంగాలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉందని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, సిబ్బంది, అంబులెన్సులు, ఎమర్జెన్సీ హెల్త్ స్టాఫ్కు కూడా మినహాయింపు ఉన్నట్లు వివరించింది.