8న నూరుశాతం పట్టాలు సాధ్యమేనా?
ABN , First Publish Date - 2020-07-06T11:02:05+05:30 IST
జిల్లాలో అర్హులైన వారికి ఇళ్లపట్టాలు పంపిణీ చేసేందుకు అఽధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇంకా జిల్లాకు చేరని 35 వేల పట్టాలు
చిత్తూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన వారికి ఇళ్లపట్టాలు పంపిణీ చేసేందుకు అఽధికారులు కసరత్తు చేస్తున్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని జూలై 8న పట్టాలు పంపిణీ చేస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. అయితే వందశాతం పట్టాలు పంపిణీ ఆ రోజు జరిగే అవకాశాలు కనిపించడంలేదు. జిల్లాలో 1,33,499 మంది లబ్ధిదారులుండగా.. 98,175 పట్టాలు మాత్రమే జిల్లాకు చేరుకున్నాయి. మిగిలిన 35,324 పట్టాలు ఇంకా రావాల్సి ఉంది. కాగా, అర్హులందరికీ పట్టాలిచ్చేందుకు మరో 250 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించాల్సి ఉంది. మిగిలిపోయిన, కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న వారికి రెండో విడతలో పంపిణీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు స్థలాన్ని ఆయా కుటుంబంలోని మహిళ పేరిట తహసీల్దార్లు రిజిస్ర్టేషన్ చేసి పట్టాలను అందించనున్నారు. లబ్ధిదారులు, స్థలం ఇతర వివరాలతో కూడిన ఇంటిపట్టాలను పుస్తకరూపంలో ముద్రించి సిద్ధం చేశారు. ఇటీవల విజయవాడ నుంచి ఇవి జిల్లాకు రాగా.. తాజాగా మండలాలకు చేరాయి. లబ్ధిదారులకు లాటరీ ద్వారా కేటాయించిన ప్లాట్ నంబరు, సర్వే నంబరుతో పాటు హద్దుల వివరాలను పంపిణీ చేసే రోజు పట్టాల్లో నమోదు చేయనున్నారు. అనంతరం తహసీల్దార్లు రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులకు వీటిని అందిస్తారు. ఇందుకుగాను ప్రభుత్వానికి లబ్ధిదారులు రూ.21 వంతున చెల్లించాల్సి ఉంటుంది.
ఇళ్లస్థలాలకు అర్హులు:
పట్టణాల్లో: 53,649
గ్రామీణప్రాంతాల్లో: 79,850
మున్సిపాలిటీల వారీగా
చిత్తూరు: 8769
పుత్తూరు: 1972
నగరి: 2305
తిరుపతి: 24,899
శ్రీకాళహస్తి: 5184
మదనపల్లె: 5317
పలమనేరు: 3262
పుంగనూరు: 1941
డివిజన్ల వారీగా(గ్రామీణ) అర్హులు:
చిత్తూరు: 18,141
తిరుపతి: 32,769
మదనపల్లె: 28,940