జిల్లాకు 1000 పైలేరియా నివారణ కిట్లు
ABN , First Publish Date - 2022-09-24T06:12:03+05:30 IST
నల్లగొండ జిల్లాకు 1000 పైలేరియా (బోధకాలు) కిట్లు వచ్చాయి. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈకిట్లను వ్యాధిగ్రస్థులకు పంపిణీ చేస్తున్నారు.
రోగులకు పంపిణీ చేస్తున్న అధికారులు
నల్లగొండ అర్బన్, సెప్టెంబరు 23: నల్లగొండ జిల్లాకు 1000 పైలేరియా (బోధకాలు) కిట్లు వచ్చాయి. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈకిట్లను వ్యాధిగ్రస్థులకు పంపిణీ చేస్తున్నారు. బోధకాలు వ్యాధిగ్రస్థులను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ఈ కిట్లను పంపిణీ చేస్తోంది. అందులో భాగంగానే ఈసంవత్సరం కూడా కిట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వచ్చాయి. జిల్లామలేరియా విభాగం ఆధ్వర్యంలో రోగులకు పంపిణీ చేస్తున్నారు. కిట్ల పంపిణీతోపాటు వ్యాధిపై ప్రజలకు ఉచితంగా అవగాహన కల్పిస్తున్నారు. బోధకాలు రావడానికి గల కారణాలు, లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య సిబ్బంది గ్రామాల్లో వివరిస్తున్నారు. ఈ కిట్టులో 5 రకాల సోప్నమైనిస్ అయింట్మెట్, ఒక బకెట్, మగ్గు, టవల్, సబ్బుతో కూడిన వస్తువులు ఉన్నాయి. బోధకాలు వ్యాధిగ్రస్థులకు ఈ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. జిల్లాలో 2,641 మంది బోధకాల వ్యాధిగ్రస్థులు ఉన్నారు. వ్యాధిగ్రస్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,116 పింఛన్ కూడా ఇస్తోంది. జిల్లాలో 1,271 మంది పింఛన్ పొందుతున్నారు. మరో 100మంది పింఛన్కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నారు. దోమలు కుట్టడంవల్ల వచ్చే ఈ వ్యాధి అంత త్వరగా బయటపడదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య అధికారులు పేర్కొంటున్నారు.