అసోంలో వరదల బీభత్సం.. 24 గంటల్లో 11 మంది మృతి
ABN , First Publish Date - 2022-06-21T02:25:07+05:30 IST
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు అసోం ప్రజలను నిద్రకు దూరం చేస్తున్నాయి. వరదలు, కొండచరియలు
దిస్పూర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు అసోం ప్రజలను నిద్రకు దూరం చేస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగి పడడం వంటి కారణాలతో గత 24 గంటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా 30 జిల్లాల్లోని దాదాపు 42 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల మరణించిన వారి సంఖ్య 70 దాటింది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. నీటమునిగిన వారిని రక్షించేందుకు వెళ్లి వరదల్లో వీరు కొట్టుకుపోయినట్టు అధికారులు తెలిపారు.
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తుండడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో మాట్లాడారు. వరదలతో అల్లాడుతున్న అసోం, మేఘాలయ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నష్టాన్ని అంచనా వేసేందుకు అంతర్ మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం(IMCT) అసోం, మేఘాలయకు వస్తుందని షా తెలిపారు.