ఇక్కడ ఇసుక తీయొద్దు
ABN , First Publish Date - 2021-04-12T05:52:34+05:30 IST
నడిపల్లి సమీపంలో తమ్మిలేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో స్థానికులు ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్లను అడ్డగించారు. పెదవేగి ఎస్ఐ టి.సుధీర్ ఘటనా స్థలానికి చేరుకుని 11 ట్రాక్టర్లను సీజ్ చేసి, పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.
భూగర్భ జలాలు ప్రమాదకరంగా తగ్గడంతో హైకోర్టు ఆదేశాలు
తమ్మిలేరులో యథేచ్ఛగా తవ్వకాలు.. అక్రమ తరలింపు.. 11 ట్రాక్టర్ల సీజ్
పెదవేగి, ఏప్రిల్ 11 : నడిపల్లి సమీపంలో తమ్మిలేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో స్థానికులు ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్లను అడ్డగించారు. పెదవేగి ఎస్ఐ టి.సుధీర్ ఘటనా స్థలానికి చేరుకుని 11 ట్రాక్టర్లను సీజ్ చేసి, పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. తమ్మిలేరు నుంచి ఇసుక తవ్వకాలను హైకోర్టు నిషేధించి నప్పటికీ అక్రమంగా తరలిస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. మెట్ట ప్రాంతమైన పెదవేగి మండలంలో సాగు, తాగునీటికి పూర్తిగా భూగర్భ జలాలే ఆధారం. వర్షాకాలంలో తమ్మిలేరు, గుండేరు వాగుల నుంచి ప్రవహించే నీరు భూగర్భంలోకి ఇంకి, జలాల పెరుగుదలకు దోహదపడతాయి. ఈ రెండు వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. దీని కారణంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ప్రమాదకరస్థాయికి పడిపోతున్నాయని, తమ్మిలేరులో తవ్వకాలు చేపట్టవద్దంటూ 2006లో కోర్టు ఆదేశించింది. కానీ తమ్మిలేరులో ఇసుక తవ్వకాలు ఆగడం లేదు. ఏదో సాకుతో ట్రాక్టర్ల కొద్దీ ఇసుక అక్రమంగా తరలిపోతూనే ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సానుభూతిపరులు దందా సాగిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పెదవేగి మండలంలో ప్రమాదకర స్థాయికి దిగజారిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ రైతుల గోడు ఎవరికీ వినిపించడం లేదు. కానీ ఇసుక అక్రమార్కుల జేబులను నింపుతోంది.
ఫిల్టర్ బెడ్ల కోసమే..
పెదపాడు మండలంలో పలు గ్రామాల్లో తాగునీటి సంబంధించి ఫిల్టర్ బెడ్ల నిర్వహణకు అధికారుల అనుమతితోనే ఇసుకను తీసుకెళుతున్నామని పెదపాడు, పాతముప్పర్రు సర్పంచ్లు జీవనకుమారి, స్వరూపరాణి తెలిపారు. ఫిల్టర్ బెడ్లను శుభ్రపర్చి, నీటిని శుద్ధి చేయడానికేనని మురికిగా వున్న నీటి సీసాలను పెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద విలేకరులకు చూపించారు.