Bus Accident: ఘోర రోడ్డుప్రమాదం.. వంతెనపై నుంచి నదిలోకి పడిపోయిన బస్సు..

ABN , First Publish Date - 2022-07-18T18:03:15+05:30 IST

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధార్‌లోని ఖాల్‌ఘాట్‌లో అదుపుతప్పి బస్సు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది..

Bus Accident: ఘోర రోడ్డుప్రమాదం.. వంతెనపై నుంచి నదిలోకి పడిపోయిన బస్సు..

ధార్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధార్‌లోని ఖాల్‌ఘాట్‌లో అదుపుతప్పి బస్సు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. 15 మందిని రెస్క్యూ టీమ్‌ రక్షించింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నట్లు తెలిసింది. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మిగిలిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇండోర్‌ నుంచి పుణె వెళ్తుండగా ఘటన జరిగింది. ఉదయం 10.45 నిమిషాల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ దుర్ఘటనపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి 15 మందిని ప్రాణాలతో కాపాడగలిగామని చెప్పారు.



ఖాల్‌ఘాట్‌లో ఉన్న Two-Lane Bridge మీదకు బస్సు రాగానే ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు బస్సు డ్రైవర్ ప్రయత్నించాడని.. ఆ క్రమంలోనే బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ఇండోర్, ధార్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటన గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మహారాష్ట్ర రాష్ట్ర రవాణా శాఖకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. ఆ వంతెన చాలా పాతది కావడంతో బస్సు అదుపు తప్పి రెయిలింగ్‌పై పడగానే ఆ రెయిలింగ్ కూడా కూలిపోయింది. ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అధికారులు స్పాట్‌కు వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారు.



ఆగ్రా-ముంబై(AB Road) హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ఇండోర్ నుంచి మహారాష్ట్రకు అనుసంధానంగా ఉంటుంది. ఇండోర్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సంజయ్ సేతు వంతెన ధార్-ఖర్‌గోన్ జిల్లాలకు మధ్య సరిహద్దుగా ఉంది. ఈ బ్రిడ్జిలో సగ భాగం ధార్ జిల్లాలో, మరో సగ భాగం ఖర్‌గోన్ జిల్లాలో ఉంది. ఖర్‌గోన్ కలెక్టర, ఎస్పీ స్పాట్‌కు చేరుకున్నారు. ఉదయం 9 నుంచి 9.15 సమయంలో ప్రయాణికులు బ్రేక్‌ఫాస్ట్, టీ నిమిత్తం ఇదే బస్సును (MH 40 N 9848) డ్రైవర్ ఖాల్‌గాట్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక హోటల్ దగ్గర పావు గంట సేపు ఆపినట్లు ఆ హోటల్ యజమాని తెలిపాడు. ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 12 నుంచి 15 మంది వరకూ బస్సు దిగి టీలు, టిఫిన్లు పూర్తి చేశారని మిగిలిన వారు బస్సులోనే కూర్చున్నారని చెప్పాడు. ఆ సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారో కచ్చితంగా చెప్పలేనని, కానీ 30 నుంచి 35 మంది వరకూ టిఫిన్‌కు దిగకుండా బస్సులోనే ఉండి ఉండవచ్చని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-07-18T18:03:15+05:30 IST