ఎక్కువగా తినడం వల్లే పొట్ట వచ్చిందనుకున్న తల్లి.. కానీ ఆ 12 ఏళ్ల కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్తే..

ABN , First Publish Date - 2021-08-24T18:44:50+05:30 IST

కరోనా లాక్‌డౌన్ కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు జరగడం లేదు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఆ 12 ఏళ్ల బాలిక లావు అవుతోంది. పొట్ట కూడా పెరుగుతోంది.

ఎక్కువగా తినడం వల్లే పొట్ట వచ్చిందనుకున్న తల్లి.. కానీ ఆ 12 ఏళ్ల కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్తే..

ఇంటర్నెట్ డెస్క్: కరోనా లాక్‌డౌన్ కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు జరగడం లేదు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఆ 12 ఏళ్ల బాలిక లావు అవుతోంది. పొట్ట కూడా పెరుగుతోంది. అయితే ఇంట్లోనే ఉండి జున్ను, నెయ్యి ఎక్కువగా తింటుండటంతో అలా కూతురు లావు అవుతోందని ఆ తల్లి అనుకుంది. అయితే కొన్నిరోజుల క్రితం కుమార్తెకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తే షాకింగ్ నిజం బయటపడింది. ఆ 12 ఏళ్ల అమ్మాయి 9 నెలల గర్భవతి అని తేలింది. ఆ బాలికకు వచ్చింది కడుపు నొప్పి కాదు పురిటి నొప్పులని తెలిసింది. డెలివరీ చేయగా ఆ బాలికకు ఒక బాబు పుట్టాడు. ఇదంతా చూసిన ఆ కుటుంబానికి ఏం జరిగిందో అర్థం కాలేదు. అసలేం జరిగిందని ఆ బాలికను అడగ్గా.. తనకు జరిగిన ఘోరాన్ని బయటపెట్టింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వెలుగు చూసింది.


సదరు బాలిక స్థానికంగా ఒక స్కూల్‌లో చదువుకునేది. ఆ సమయంలో ఒక రోజు ఇంటికి వస్తున్న ఆమెను.. అదే బడిలో 9వ తరగతి చదివే ఇద్దరు కుర్రాళ్లు కిడ్నాప్ చేశారు. జీప్‌లో వచ్చిన వాళ్లిద్దరూ ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సడెన్‌గా కరోనా రావడం, లాక్‌డౌన్ విధించడంతో ఆమె బయటకు వెళ్లలేదు. ఇంట్లోనే ఉండిపోయింది. అయితే తన శరీరంలో మార్పులు రావడంతో తాను గర్భవతి అయినట్లు ఆమెకు అర్థమైంది. కానీ ఆ మాట ఎవరికి చెప్పాలో తెలియలేదు. స్కూల్ ఉంటే తన స్నేహితురాళ్లకైనా చెప్పేదాన్నని, అది కూడా లేకపోవడంతో ఇంట్లో ఎవరికీ నిజం చెప్పలేకపోయానని ఆ బాలిక ఏడ్చేసింది. ఆ కుటుంబంలో నలుగురు పిల్లలుండగా.. ఈ బాలికే అందరికన్నా చిన్నది. దీంతో ఎవరికి ఈ విషయం చెప్పాలన్నా ఆ బాలికకు భయమేసిందట.


ఆస్పత్రిలో డెలివరీ తర్వాత జీవితం ఏమవుతుందో కూడా తెలియని స్థితిలో ఆ బాలిక ఉంది. తల్లి ఏం చెప్తే అదే చేస్తానని అంటోంది. కుమార్తె ఇంత బాధలో ఉన్నా తాను గుర్తించలేకపోయానని ఆ తల్లి కూడా బాధపడుతోంది. గుడికి రమ్మని పిలిచిన ప్రతిసారీ కుమార్తె ఏదో ఒక వంకతో తప్పించుకునేదని, అలా ఎందుకు జరిగిందో కూడా గుర్తించలేకపోయానని ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. తప్పు చేశాననే భావనే తన కుమార్తె మనసును పట్టిపీడిస్తోందని వాపోయింది. ఈ విషయం తెలిసిన బాల సంరక్షణ విభాగం రంగంలోకి దిగింది. బాలికకు ధైర్యం చెప్పింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-08-24T18:44:50+05:30 IST