మతహింసపై మోదీ మౌనం దిగ్భ్రాంతికరం: 13 విపక్ష పార్టీల నేతల సంయుక్త ప్రకటన

ABN , First Publish Date - 2022-04-17T02:20:46+05:30 IST

దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చెలరేగిన మతపరమైన హింసాకాండ, విద్వేష పూరిత ప్రకటనలపై తీవ్ర ఆందోళన ..

మతహింసపై మోదీ మౌనం దిగ్భ్రాంతికరం: 13 విపక్ష పార్టీల నేతల సంయుక్త ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చెలరేగిన మతపరమైన హింసాకాండ, విద్వేష పూరిత ప్రకటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ 13 విపక్ష పార్టీల నేతలు శనివారంనాడు ఒక సంయుక్త ప్రకటన చేశారు. శాంతి, సామరస్యాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆహారం, దుస్తులు, విశ్వాసాలు, పండుగలు, భాషకు సంబంధించిన అంశాలను సమాజాన్ని పోలరైజ్ చేసేందుకు అధికార పార్టీలు ఉపయోగించుకుంటుండటం పట్ల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖాండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు ఈ మేరకు సంయుక్త ప్రకటన చేశారు.


''ప్రధానమంత్రి మోదీ మౌనం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మతదురభిమానాన్ని ప్రోత్సహిస్తూ, సమాజాన్ని రెచ్చగొడుతూ మాట్లాడుతున్న వారు, చర్యలకు పాల్పడుతున్న వారిపై కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు. దీనిపై మౌనం దాల్చడం అంటే... ప్రైవేటు సాయుధ మూకలను అధికారికంగా ప్రోత్సహించడంతో సమానం'' అని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. శతాబ్దాలుగా భారతదేశ ఔన్నత్యాన్ని, సమున్నత కీర్తిని చాటిచెబుతూ వచ్చిన సామాజిక సామరస్యాన్ని పటిష్టం చేసేందుకు తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని, ఇందుకు పునరంకితమవుతామని విపక్ష నేతలు పునరుద్ఘాటించారు. సమాజాన్ని విడగొట్టే విషపూరిత సిద్ధాంతాలతో పోరాటానికి కట్టుబడి ఉన్నామని నేతలు తెలిపారు. మతపరమైన పోలరైజేషన్‌ను మరింత పదునెక్కించేందుకు చూసే దుష్ట శక్తుల పన్నాగాలను తిప్పిగొట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు శాంతిసామరస్యాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. శాంతిసామరస్యాలను కాపాడేందుకు పార్టీల పరంగా, సంయుక్తంగా పనిచేయాలని దేశవ్యా్ప్తంగా ఉన్న పార్టీ యూనిట్లకు సంయుక్త ప్రకనటలో ఆయా నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈనెల 10వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా దేశంలోని పలు చోట్ల మత ఘర్షణలు తలెత్తాయి.

Updated Date - 2022-04-17T02:20:46+05:30 IST