మూకుమ్మడి అత్యాచారం అంటూ 13 ఏళ్ల బాలిక కట్టు కథ.. ఎందుకిలా చేశావని పోలీసులు నిలదీస్తే ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2021-08-13T22:34:25+05:30 IST

కొందరు యువకులు తనను మూకుమ్మడి అత్యాచారం చేశారంటూ 13ఏళ్ల బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు స్థానికంగా సంచలనం సృష్టించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారం

మూకుమ్మడి అత్యాచారం అంటూ 13 ఏళ్ల బాలిక కట్టు కథ.. ఎందుకిలా చేశావని పోలీసులు నిలదీస్తే ఆమె చెప్పింది విని..

రాజస్థాన్: కొందరు యువకులు తనను మూకుమ్మడి అత్యాచారం చేశారంటూ 13ఏళ్ల బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు స్థానికంగా సంచలనం సృష్టించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అయితే దర్యాప్తులో పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఆ 13ఏళ్ల బాలికపై అసలు అత్యాచారమే జరగలేదని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఎందుకిలా చేశావంటూ ఆమెను పోలీసులు నిలిదిశారు. ఈ క్రమంలో ఆ 13ఏళ్ల బాలిక చెప్పిన విషయాలు విని.. సదరు అధికారులు షాక్ అయిన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. కాగా.. 13ఏళ్ల బాలిక ఫిర్యాదుకు గల కారణాలు ఏంటనే విషయంలోకి వెళితే..



రాజస్థాన్‌లోని బిల్వారా మండలానికి చెందిన ఓ బాలిక మూడేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో ఆమెకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ నలుగురు మేనమామలే చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ అమ్మాయి వయసు 13 ఏళ్లు. కాగా.. కొద్ది రోజుల క్రితం స్థానిక అట్టా-సాటా సంప్రదాయం ప్రకారం.. ఆ బాలిక నలుగురు మేనమామల్లో ఒకరికి వివాహం జరిగింది. ఈ సంప్రదాయంలో భాగంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. పెళ్లి కూతురు అత్తారింటికి రావాలంటే ఈ 13ఏళ్ల అమ్మాయి శాశ్వితంగా వధువు పుట్టింటికి వెళ్లాల్సి ఉంది. మేనమామ భార్య ఇంట్లో ఒకరిని ఈ బాలిక పెళ్లాడాల్సి ఉంటుంది. అయితే అలా వెళ్లడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. దీంతో పెళ్లి కొడుకు (బాధితురాలి మేనమామ) రంగంలోకి దిగాడు. మేనకోడలుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె ససేమిరా అంది. ఈ క్రమంలో ఒప్పందం ప్రకారం ‘నీ మేనకోడలిని నా ఇంటికి పంపిస్తేనే నా కూతురు నీకు భార్యగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది’ అని వరుడి (బాధితురాలి మేనమామ)కి తెగేసి చెప్పేశాడు. దీంతో అతను తన భార్యకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతను ఆగ్రహంతో ఊగిపోయి.. మేన కోడలిని తీవ్రంగా హింసించడం ప్రారంభించాడు. 



ఓ వైపు ఈ చిత్రహింసలు.. మరోవైపు లైంగింక (మరో మేనమామ) వేధింపులను ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. అర్థరాత్రి తర్వాత లోదుస్తులతోనే స్థానికంగా ఉన్న గుడి వద్దకు వెళ్లి.. తనను కొందరు అక్కడ అత్యాచారం జరిపినట్టు సీన్ క్రియేట్ చేసింది. అనంతరం మేనమామతో (వరుడు) కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ అమ్మాయిపై అసలు అత్యాచారమే జరగలేదని మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ద్వారా తేల్చారు. ఈ నేపథ్యంలోనే ఆ బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించి.. కట్టుకథ అల్లాడానికి గల కారణాలపై ఆరా తీశారు. దీంతో ఆ చిన్నారి.. తన బాధలను పోలీసులకు ఎకరువు పెట్టింది. ఆ అమ్మాయి కథ విని.. చలించి పోయిన పోలీసులు.. ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న అనాగరిక సంప్రదాయలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిపై త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. 


Updated Date - 2021-08-13T22:34:25+05:30 IST