ఐదేళ్లలో 141 మ్యాచ్లు
ABN , First Publish Date - 2022-08-18T11:50:48+05:30 IST
రాబోయే ఐదేళ్ల భవిష్య పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లో టీమిండియా భారీ సంఖ్యలో 141 ద్వైపాక్షిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. ఈమేరకు మే, 2203
38 టెస్ట్లు, 42 వన్డేలు, 61 టీ20లు
వచ్చే ఎఫ్టీపీలోనూ టీమిండియా బిజీ
న్యూఢిల్లీ : రాబోయే ఐదేళ్ల భవిష్య పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లో టీమిండియా భారీ సంఖ్యలో 141 ద్వైపాక్షిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. ఈమేరకు మే, 2203 నుంచి ఏప్రిల్ 2027 కాలానికి సంబంధించిన ఎఫ్టీపీని ఐసీసీ బుధవారం ప్రకటించింది. భారత్ రాబోయే ఎఫ్టీపీలో 38 టెస్ట్లు, 42 వన్డేలు, 61 టీ20లలో తలపడనుంది. ఎప్పటిలాగానే భారత జట్టుకు కిక్కిరిసే షెడ్యూల్ ఉన్నా.. అదే సమయంలో పాకిస్థాన్తో మాత్రం ద్వైపాక్షిక సిరీస్లు లేకపోవడం గమనార్హం. ఐసీసీ 12 అనుబంధ దేశాల జట్లు అన్నీ కలిపి రాబోయే ఎఫ్టీపీలో మొత్తం 777 మ్యాచ్లు ఆడను న్నాయి. ఇందులో 173 టెస్ట్లు, 281 వన్డేలు, 323 టీ20లున్నాయి.
‘బోర్డర్-గవాస్కర్’లో ఐదు టెస్ట్లు
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లే నిర్వహిస్తున్నారు. కానీ రాబోయే ఎఫ్టీఫీలో ఐదు టెస్ట్లకు పెంచారు. ఇక.. వచ్చే ఎఫ్టీపీలో రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల పూర్తిస్థాయి సిరీస్కోసం భారత జట్టు వెస్టిండీస్ (జూలై, ఆగస్టు-2023)లో పర్యటించనుంది. ఇంగ్లండ్తో స్వదేశంలో ఐదు టెస్ట్లు జనవరి-మార్చి 2024లో జరగనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో నాలుగు టెస్ట్ల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్ రానుంది. డిసెంబరు, జనవరి 2024-25లో ఐదు టెస్ట్ల సుదీర్ఘ సిరీస్కోసం టీమిండియా..ఆస్ట్రేలియా వెళ్లనుంది. 2023 వన్డే వరల్డ్ కప్నకు ముందు..27 వన్డేల్లో భారత్ పాల్గొననుంది. జింబాబ్వేతో గురువారం నుంచి జరిగే సిరీస్తో ఇవి ఆరంభం కానున్నాయి.