టీఆర్‌ఎస్‌కు 15 సీట్లే

ABN , First Publish Date - 2022-07-31T08:22:40+05:30 IST

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు 15 సీట్లకు మించి రాబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తేల్చిచెప్పారు. తమకు

టీఆర్‌ఎస్‌కు 15 సీట్లే

అంతకు మించి రాబోవు

లోక్‌సభ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్సే ఉండదు

బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఖాయం

ఎంఐఎం స్థానాన్నీ కైవసం చేసుకుంటాం

కేసీఆర్‌ ఫొటోతో ఎన్నికలకు వెళ్లేందుకు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జంకుతున్నారు

‘కాళేశ్వరం’ అవినీతిపై రేవంత్‌ కోర్టుకెళ్లరే?

సర్కార్‌పై ఉద్యోగుల తిరుగుబాటు ఖాయం

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంచి వ్యక్తి

మునుగోడు ‘ఎన్నిక’ వద్దన్నది కాంగ్రెస్‌ కోరిక

మీడియాతో బండి  సంజయ్‌ చిట్‌చాట్‌

ప్రజలు వరదల్లో.. కేసీఆర్‌ ఢిల్లీలో!

సీఎం తీరు విచారకరం.. కిషన్‌రెడ్డి విమర్శ

మూసారాంబాగ్‌ బ్రిడ్జి పరిశీలన

లోక్‌సభ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్సే ఉండదు.. బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఖాయం

మీడియాతో బండి  సంజయ్‌ చిట్‌చాట్‌

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు 15 సీట్లకు మించి రాబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తేల్చిచెప్పారు. తమకు 90 సీట్లు వస్తాయంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ కూడా ఇలాగే బీరాలు పలికిందని, ఎన్టీఆర్‌ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మరచిపోవద్దన్నారు. శనివారం ఒక హోటల్‌లో సంజయ్‌ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్సే ఉండదని, ఇక ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై చర్చ ఎక్కడ ఉంటుందని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఖాయమని, ఎంఐఎం సీటు కూడా తాము కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఇప్పుడు చెల్లని రూపాయి అని.. ఆయన బొమ్మతో గెలవడం కష్టమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జంకుతున్నారన్నారు. అందుకే ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్‌ మళ్లీ మాట్లాడటం లేదని చెప్పారు.  మునుగోడుకు ఉప ఎన్నిక రావాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారని, ఉద్యోగులకు వేతనాల ఆలస్యం, వరదలు వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి ఉప ఎన్నికపై మరలుతుందని ఆయన నమ్మకమేమో అని వ్యాఖ్యానించారు. ఇక, ఉపఎన్నిక జరగవద్దని కాంగ్రెస్‌ కోరుకుంటోందన్నారు. ప్రజల అభీష్టం మేరకే బీజేపీ ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతితో పాటు వి విధ పథకాల్లో అక్రమాలపై అన్ని ఆధారాలుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎందుకు కోర్టులను ఆశ్రయించడం లేదని ప్రశ్నించారు. క్యాసినో వ్యవహారం బయటపడగానే టీఆర్‌ఎస్‌ నాయకులు భయపడుతున్నారన్నారు. చీకటి దందాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా టీఆర్‌ఎస్‌ మారిందని ఆరోపించారు. 


‘టికెట్‌’పై పార్టీ పార్లమెంటరీ బోర్డుదే నిర్ణయం

ఎన్నికల్లో ఎవరికి టికెట్‌ ఇవ్వాలన్నది తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని సంజయ్‌ తెలిపారు. తనతో సహా.. ఏ నాయకుడు కూడా తనకు తాను ఫలానా స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించే సంప్రదాయం బీజేపీలో లేదన్నారు. తాను ఒక స్థానం నుంచి పోటీ చేస్తానని ఒక నాయకుడు తన అభిప్రాయంగా చెప్పవచ్చు.. కానీ అదే ఫైనల్‌ కాదని స్పష్టం చేశారు. తాను గజ్వేల్‌ నుంచి పోటీ చేయబోతున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో సంజయ్‌ పైవిధంగా స్పందించారు. 


సీఎం భద్రాచలం పర్యటన ఓ డ్రామా!

వరదల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోవడానికి సీఎం కేసీఆరే కారణమని ఆరోపించారు. ఈ అంశంపై ప్రజలు ప్రశ్నిస్తారన్న భయంతో.. అందరి దృష్టిని మరల్చేందుకు సీఎం భద్రాచలం వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లారని, అదంతా ఓ డ్రామా అని విమర్శించారు. వరద బాధితులను పట్టించుకోకుండా వారం రోజులుగా కేసీఆర్‌ ఢిల్లీలో మకాం వేశారన్నారు. ఢిల్లీలో ఎవరి ఇంటికో వెళ్లిన కేసీఆర్‌.. తమ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ను కలుసుకున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆయన విమర్శించారు.    


రాజగోపాల్‌రెడ్డి మంచి వ్యకి

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంచి వ్యక్తి అని సంజయ్‌ కితాబిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ఆయనకు ఎప్పటినుంచో నమ్మకం ఉందని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డితో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి భేటీ అంశాన్ని మీడియా సంజయ్‌ దృష్టికి తీసుకువెళ్లగా.. బహుశా ఉత్తమ్‌ కూడా బీజేపీలోకి వస్తారేమో అని సరదాగా వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్‌ కాలు ఫ్రాక్చర్‌ అయి విశ్రాంతి తీసుకుంటున్న దృష్ట్యా, ఆయన్ను ఫోనులోనైనా పరామర్శించారా? అని ప్రశ్నించగా.. ఆయన మంచిగ ఉండాలనే కోరుకుంటా.. అని అన్నారు. సెప్టెంబరు 17ను విమోచన దినంగానే పరిగణిస్తామని, విముక్తి దినం అంటూ జరిగిన ప్రచారం తప్పు అని ఆయన స్పష్టం చేశారు.  


పాతబస్తీ సంగతి చూస్తం.. ఇది పక్కా..

పాతబస్తీ (హైదరాబాద్‌ ఎంపీ స్థానం) సంగతి చూస్తం.. ఇది పక్కా.. మలక్‌పేట, కార్వాన్‌, చాంద్రాయణగుట్ట, గోషామహల్‌లో మాకు మంచి పట్టుంది.. ఇక ఎంపీ స్థానం ఎందుకు గెలువం? యూపీలో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ఆజంగఢ్‌నే బీజేపీ గెలుచుకున్నప్పుడు ఇక్కడెందుకు సాధ్యం కాదు? మజ్లి్‌సను భరించే ఓపిక తమకు ఇక లేదని ముస్లింలే అంటున్నరు. బీజేపీయే కావాలని ముస్లిం మహిళలు కోరుకుంటున్నరు. మాకు షెల్టర్‌ జోన్‌లుగా ఉండే ప్రాంతాల్లో అభివృద్ధిని నక్సల్స్‌ అడ్డుకునేవారు. ఇప్పుడు పాతబస్తీలో అభివృద్ధిని మజ్లిస్‌ అడ్డుకుంటోంది అని సంజయ్‌ ఆరోపించారు. 


మేం డిమాండ్‌ చేయకపోతే ఉద్యోగులకు మూణ్నెల్లకోసారి జీతాలొచ్చేవి

ప్రజా సంగ్రామ యాత్ర మూడోదశ పూర్తయిన తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తిరగబడడం ఖాయం. నేను గడచిన నాలుగు నెలల నుంచి డిమాండ్‌ చేస్తూ ఉండకపోతే ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కేసీఆర్‌ మూణ్నెల్లకోసారి వేతనాలు ఇచ్చేవారు. మాకు భయపడి ప్రతినెలా ఆలస్యంగానైనా జీతాలు ఇస్తున్నారు అని సంజయ్‌ చెప్పారు.

Updated Date - 2022-07-31T08:22:40+05:30 IST