షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో 1/70 కొరడా

ABN , First Publish Date - 2021-07-22T04:33:00+05:30 IST

షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజనేతరుల నివాస గృహాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం 1/70కొరడా ఝులిపించింది. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ అధికారులు

షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో 1/70 కొరడా

కోర్టు మందలింపుతో అప్రమత్తమైన అధికారులు

గిరిజనేతరుల ఇళ్లు, భవనాల నిర్మాణంపై ఆంక్షలు

గగ్గోలుపెడుతున్న గిరిజనేతరులు

ఇల్లెందు, జూలై 21: షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజనేతరుల నివాస గృహాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం 1/70కొరడా ఝులిపించింది. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనేతరులు నిర్మిస్తున్న నివాస గృహాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలను నిలిపివేయాలంటూ నోటీసులు జారీచేస్తుండటంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు.  తాత ముత్తాతల కాలం నుంచి షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనేతరులు తమ కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణాలను విస్తరించుకోవడం, బహుళ అంతస్తులను నిర్మించుకోవడం వంటి చర్యలు చేపడుతుండటంతో జిల్లా అధికారులు గిరిజనచట్టాల నిబంధనల పేరుతో నిర్మాణాలు నిలిపివేయాలంటూ నోటీలు జారీ చేస్తున్నారు. చుంచుపల్లి మండలం విద్యానగర్‌ ప్రాంతంలో కొద్ది నెలల క్రితం గిరిజనేతరుడు నిర్మించిన భవనాన్ని కోర్టు ఆదేశాలతో నిలిపివేశారు. ఈ సందర్భంగా అధికారులను నాయయస్థానం తీవ్రస్థాయిలో మందలించడంతో అప్రతమత్తమైన జిల్లా అధికారులు జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలపై దృష్టి సారించారు. కలెక్టర్‌ ఆదేశాల లేఖ నెం. ఆర్‌సీ ఎల్‌సీ2/డబ్ల్యూపీనెం. 5820/2021 తేదీ 8.4.2021, జీవోఎంఎస్‌నెం. 67, తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం 2018 ప్రకారం షెడూల్డ్‌ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను తొలగించేందుకు అధికార యంత్రాంగాలు చర్యలు చేపట్టాయి. ఇల్లెందు పట్టణంలోనే అంతర్భాగంగా దశాబ్ధాల కాలం నుంచి కొనసాగుతున్న కరెంట్‌ ఆఫీస్‌ సెంటర్‌ భౌగోళికంగా ఇల్లెందు మండలం సుభాష్‌నగర్‌ పంచాయతీ పరిధిలో ఉంది. ఇల్లెందు రూరల్‌ మండలం యావత్తు షెడ్యూల్డ్‌ ప్రాంతం కావడంతో 1/70చట్టం అమలులో ఉన్నప్పటికీ గిరిజనేతరులు అనేక మంది బహుళ అంతస్తుల నివాస, వాణిజ్య భవనానలు నిర్మిస్తున్నారంటూ వాటికి, గ్రామపంచాయతీల అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని మండల పంచాయతీ అధికారులు నిర్మాణాలు నిలిపివేయాలంటూ నోటీసులు జారీచేశారు. పంచాయతీరాజ్‌ చట్టం 2018 ప్రకారం నిర్మాణ అనుమతులు పంచాయతీ నుంచి పొందవలసి ఉందని, కానీ ఎలాంటి అనుమతులు లేకుండా జరుపుతున్న నిర్మాణాలు నిలిపివేయాలని, ఇప్పటి వరకు నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని పంచాయతీ అధికారులు గిరిజనేతర ఇళ్ల యజమానులకు నోటీసులు జారీచేశారు. ఈ పరిణామంతో షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని గిరిజనేతరులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. షెడ్యూట్డ్‌ ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివాసం ఉండటం, వారసత్వంగా వచ్చిన భూములను సాగుచేస్తూ నివసిస్తున్న తమను గృహనిర్మాణాలు చేపట్టవద్దని ఆంక్షలు విఽధించడం ఎంతవరకు న్యాయమని గిరిజనేతరులు వాపోతున్నారు.

Updated Date - 2021-07-22T04:33:00+05:30 IST