18 రోజులు.. 2 క్వారంటైన్లు

ABN , First Publish Date - 2021-05-09T09:32:45+05:30 IST

ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈనెల 25 నుంచే సన్నాహకాలు ఆరంభం

18 రోజులు.. 2 క్వారంటైన్లు

టీమిండియాకు కఠిన సవాల్‌

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బీసీసీఐ రోడ్‌మ్యాప్‌


న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈనెల 25 నుంచే సన్నాహకాలు ఆరంభం కానున్నాయి. వచ్చే నెల 18 నుంచి న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది. దీనికి బీసీసీఐ ఓ రోడ్‌మ్యా్‌పను ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగా ఆటగాళ్లంతా మొత్తం 18 రోజుల పాటు రెండు క్వారంటైన్లలో ఉండాల్సి వస్తోంది. ఇంగ్లండ్‌కు బయలుదేరే క్రికెటర్లంతా మొదట స్వదేశంలో ఏర్పాటయ్యే బయో బబుల్‌లో 8 రోజులు ఉంటారు. ఆ తర్వాత జూన్‌ 2న జట్టంతా ఇంగ్లండ్‌ వెళుతుంది. అయితే అక్కడికి వెళ్లాక కూడా స్వేచ్ఛగా తిరుగుతామంటే కుదరదు.


మరో 10 రోజుల పాటు జట్టుకు క్వారంటైన్‌ తప్పనిసరి. అయితే ఈ సమయంలో మాత్రం సాధన చేసుకోవచ్చు. ‘మే 25న భారత ఆటగాళ్లంతా బయో బబుల్‌లో చేరి ఎనిమిది రోజుల పాటు ఉంటారు. ఇక జూన్‌ 2న ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌ బయలుదేరతారు. అక్కడ మరో 10 రోజుల క్వారంటైన్‌ ఉన్నా ప్రాక్టీస్‌ చేయవచ్చు. ఈ సమయంలో నిరంతరం కొవిడ్‌ టెస్టులు జరుగుతాయి’ అని బోర్డు అధికారి తెలిపాడు.


ఫ్యామిలీలకు ఓకే: 

డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కలిపి భారత జట్టు ఈ పర్యటనలో మూడు నెలలకు పైగా అక్కడే ఉండనుంది. కివీ్‌సతో ఫైనల్‌ ముగిశాక..ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆరంభానికే సుమారు నెలన్నర సమయం ఉంటుంది. ఈ సమయంలో ఆటగాళ్లంతా హోటల్‌ గదులకు పరిమితం కావాల్సిందే. అందుకే కుటుంబసభ్యులతో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు బోర్డు అనుమతించింది. ‘కొవిడ్‌ రూల్స్‌ ప్రకారం బయట ఎక్కడా తిరగడానికి ఉండదు. అందుకే ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు వెళ్లేందుకు కూడా అనుమతించాం’ అని బీసీసీఐ అధికారి తెలిపాడు.


రెండో డోస్‌ వ్యాక్సిన్‌పై ఆలోచించాలి: కేంద్రం 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అనుమతించడంతో క్రికెటర్లు మొదటి డోస్‌ వేసుకునేందుకు వీలు చిక్కింది. కానీ రెండో డోస్‌ సమయానికి వీరంతా ఇంగ్లండ్‌లో ఉంటారు. అందుకే అక్కడే వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుతో బీసీసీఐ చర్చించనుందని సమాచారం. ఒకవేళ యూకే ప్రభుత్వం ఇందుకు అంగీకరించకపోతే భారత్‌ నుంచి వ్యాక్సిన్లు తెప్పించి ఆటగాళ్లకు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని బోర్డు అధికారి వివరించాడు.

Updated Date - 2021-05-09T09:32:45+05:30 IST