బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో గొడవ.. ఇద్దరి హత్య

ABN , First Publish Date - 2021-03-06T23:23:55+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో జరిగిన గొడవ ఇద్దరి హత్యకు కారణమైంది. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో

బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో గొడవ.. ఇద్దరి హత్య

భోపాల్: బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో జరిగిన గొడవ ఇద్దరి హత్యకు కారణమైంది. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో గత రాత్రి 10 గంటల సమయంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నహోటా పోలీస్ స్టేషన్ పరిధిలోని బన్వర్ గ్రామంలో జబేరా ఎమ్మెల్యే ధర్మేంద్రసింగ్ లోధీ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన వారి మధ్య ప్రారంభమైన గొడవ ఇద్దరి మరణానికి దారితీసినట్టు దామో ఎస్పీ హేమంత్ చౌహాన్ తెలిపారు. బాధితులను 30 ఏళ్ల జోగేంద్ర సింగ్, అర్వింద్ జైన్‌గా గుర్తించారు. జోగేంద్ర సింగ్ కాల్పుల్లో మరణించగా, అర్వింద్ జైన్‌ను కర్రలు, రాళ్లతో కొట్టి చంపినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.


ఆ వేడుకకు అర్వింద్ జైన్ ఎమ్మెల్యే ప్రతినిధిగా హాజరు కాగా, జోగేంద్రసింగ్ గెస్ట్ టీచర్‌గా వచ్చారు. ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే ధర్మేంద్రసింగ్ లోధీ అక్కడ లేరని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ మండిపడింది. శాంతి భద్రతలను అదుపు చేయడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారని దామో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ టాండన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వస్తుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంత భద్రత ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం ఏంటని ఆయన ప్రశ్నించారు.  

Updated Date - 2021-03-06T23:23:55+05:30 IST