2 వేల కోసం ఫ్రెండ్ను దారుణంగా చంపేశాడు..!
ABN , First Publish Date - 2021-11-12T16:53:24+05:30 IST
రెండు వేలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నందుకు..
హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్ : అప్పుగా తీసుకున్న రూ. రెండు వేలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నందుకు ఓ వ్యక్తి స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ముషీరాబాద్లోని ఫకీర్వాడలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసికి చెందిన సోనూ దేవ్ (27) ఆరేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చాడు. ముషీరాబాద్లోని ఫకీర్వాడలో నివాసముంటూ బ్రహ్మచారి అనే కార్పెంటర్ వద్ద పని చేస్తున్నాడు. సోనూకు మటన్ దుకాణంలో పనిచేసే అల్తా్ఫ్ఖాన్తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహంగా ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
అవసరాల నిమిత్తం సోనూ కొద్ది రోజుల క్రితం అల్తా్ఫఖాన్ నుంచి రూ.2 వేలు అప్పు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వడంలో సోనూ జాప్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 9 గంటలకు ఈ విషయంపై ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. కోపోద్రిక్తుడైన అల్తా్ఫ్ఖాన్ మటన్ దుకాణంలోని కత్తితో సోనూ గొంతుకోశాడు. సోనూ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్, సీఐ జాహంగీర్ యాదవ్, డీఐ వెంకన్న, ఎస్ఐ వెంకటరెడ్డి సందర్శించారు. మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అల్తా్ఫఖాన్ నేరుగా ముషీరాబాద్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సోనూకు ఆర్నెళ్ల క్రితమే వివాహమైందని, అతడి భార్య ప్రస్తుతం వారణాసిలోని ఇంటి వద్ద ఉందని తెలిసింది.