ఒకే రోజు 205 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2022-01-21T06:17:16+05:30 IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొవిడ్ కేసులు వేగంగా పరుగులు తీస్తున్నాయి. ఒకవైపు కరోనా కేసులు భయపెడుతుంటే మరోవైపు గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వారిలో ఒమైక్రాన్ పాజిటివ్ కలకలం రేపుతోంది.
- సిరిసిల్ల జిల్లాలో ఒకరికి ఒమైక్రాన్
-రోజు రోజుకు పెరుగుతున్న కేసులు
సిరిసిల్ల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొవిడ్ కేసులు వేగంగా పరుగులు తీస్తున్నాయి. ఒకవైపు కరోనా కేసులు భయపెడుతుంటే మరోవైపు గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వారిలో ఒమైక్రాన్ పాజిటివ్ కలకలం రేపుతోంది. ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామానికి చెందిన 33 ఏళ్ల వ్యక్తి ఈ నెల 14న దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఇతనికి మొదట కొవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. తర్వాత ఒమైక్రాన్ నిర్ధారణ పరీక్షకు పంపించగా 19న ఒమైక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్లో ఉన్న అతనిని గురువారం హైదరాబాద్ టిమ్స్కు తరలించారు. జిల్లాలో ఒమైక్రాన్ కేసులు ఐదుకు పెరిగాయి. మరోవైపు రోజు రోజుకు కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రుద్రంగిలో బ్యాంక్ ఇద్దరు సిబ్బందికి కరోనా రావడంతో బ్యాంక్ మూసివేసి శానిటైజేషన్ చేశారు.
గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 1240 మంది కొవిడ్ పరీక్షలు చేయగా 205 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో తంగళ్లపల్లి మండలంలో 21 మంది, కోనరావుపేటలో నలుగురు, ఇల్లంతకుంటలో అరుగురు, గంభీరావుపేటలో ముగ్గురు, ముస్తాబాద్లో నలుగురు, ఎల్లారెడ్డిపేటలో 16 మంది, వేములవాడలో 34 మంది, చందుర్తిలో ఇద్దరు, బోయినపల్లిలో ముగ్గురు, సిరిసిల్లలో 112 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది జిల్లాలో ఇప్పటి వరకు 33197 మంది కొవిడ్ బారిన పడగా 31957 మందికోలుకున్నారు. 671 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకు జిల్లాలో 569 మంది మృతిచెందారు.