Bangladesh Boat Accident: బంగ్లాదేశ్లో విషాదం.. పడవ మునిగి 23 మంది జలసమాధి
ABN , First Publish Date - 2022-09-25T23:51:35+05:30 IST
బంగ్లాదేశ్ (Bangladesh)లో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో 23 మంది జలసమాధి అయ్యారు. పదుల
ఢాకా: బంగ్లాదేశ్ (Bangladesh)లో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో 23 మంది జలసమాధి అయ్యారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ఉత్తర పంచగఢ్ (northern Panchagarh)లో జరిగిన ఈ ప్రమాదం సంభవించినట్టు జిల్లా అధికారి జహురుల్ ఇస్లాం తెలిపారు. ఇప్పటి వరకు వెలికి తీసిన మృతదేహాల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారని, గల్లంతైన వారికి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎంతమంది గల్లంతయ్యారన్న స్పష్టమైన సమాచారం లేదన్న ఆయన ప్రమాద సమయంలో బోటులో 70 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు.
బంగ్లాదేశ్లో పడవ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి ఏడాది వందలాదిమంది ఇటువంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ ప్రయాణానికి ఎక్కువ మంది జలమార్గాలనే ఎంచుకుంటారు. అయినప్పటికీ సరైన సౌకర్యాలు, భద్రతా పరమైన చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి వందలాదిమంది జలసమాధి అవుతున్నారు. పద్మా నదిలో ఈ ఏడాది మేలో ప్రయాణికులతో వెళ్తున్న స్పీడ్బోటు ఓ ఇసుక కేరియర్ను ఢీకొట్టడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.