Cabinet meeting: 26న మంత్రివర్గ సమావేశం
ABN , First Publish Date - 2022-09-24T13:32:19+05:30 IST
రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 26వ తేదీ సమావేశం కానుంది. సచివాలయంలో జరిగే ఈ కేబినెట్ మీటింగ్కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షత
- అసెంబ్లీ సమావేశాలపై చర్చ
అడయార్(చెన్నై), సెప్టెంబరు 23: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 26వ తేదీ సమావేశం కానుంది. సచివాలయంలో జరిగే ఈ కేబినెట్ మీటింగ్కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షత వహించనున్నారు. ఇందులో అసెంబ్లీ(Assembly) సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే మంత్రివర్గ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరుకాన్నారు. ఈ కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షే మానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అదేవిధంగా అక్టోబరులో శాసనసభ సమావేశం జరుగనుంది. ఇందులో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశాలు మే 10తో ముగిశాయి. ఒక సమావేశం ముగిసిన తర్వాత ఆర్నెల్ల లోపు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. ఆ ప్రకారంగా నవంబరు మొదటి వారంలోనే ఈ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే, అక్టోబరు - డిసెంబరు నెలల్లో ఈశాన్య రతుపవనాల ప్రవేశంతో వర్షాకాలం ఆరంభమవుతుంది. ఈ సమయంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సీఎం ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి, తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.
5 రోజులపాటు జరిగే అవకాశం ?
ఈ అసెంబ్లీ సమావేశాలను దీపావళి పండుగకు ముందుగా ఐదు రోజుల పాటు జరిపే అవకాశం ఉంది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మరణంపై రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి ఇచ్చిన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదు. అలాగే, తూత్తుక్కుడి కాల్పుల ఘటనపై కమిటీ ఇచ్చిన నివేదిక కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా రమ్మీ వంటి ఆన్లైన్ క్రీడలపై నిషేధం విధించేలా అత్యవసర ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు.