షార్జాలో భారత కార్మికుడు అనుమానాస్పద మృతి !

ABN , First Publish Date - 2020-11-26T00:58:24+05:30 IST

27 ఏళ్ల భారత కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన బుధవారం షార్జాలో చోటుచేసుకుంది.

షార్జాలో భారత కార్మికుడు అనుమానాస్పద మృతి !

షార్జా: 27 ఏళ్ల భారత కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన బుధవారం షార్జాలో చోటుచేసుకుంది. షార్జాలోని అల్ హమ్రియా ప్రాంతంలోని అతడి నివాసంలోనే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఇది గమనించిన తోటి కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. కార్మికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న హమ్రియా పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి దర్యాప్తు కోసం మృతదేహాన్ని అల్ ఖాసిమి ఆసుపత్రికి తరలించారు. పోలీసులతో పాటు ఘటనాస్థలిని పరిశీలించిన క్రిమినల్ దర్యాప్తు బృందాలకు మృతుడిపై హత్యాయత్నం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, షార్జాలో ఈ నెలలో ఇది రెండో సంఘటన. గత వారం 21 ఏళ్ల ఆసియా విద్యార్థి ఒకరు అల్ మజాజ్‌లో తాను నివాసముండే అపార్ట్‌మెంట్‌లోనే ఇలాగే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 


Updated Date - 2020-11-26T00:58:24+05:30 IST