Indian Army : హంగేరియన్ ట్రెక్కర్‌ను కాపాడిన భారత సైన్యం

ABN , First Publish Date - 2022-08-27T23:39:30+05:30 IST

హిమాలయ పర్వత ప్రాంతాల్లో దారి తప్పిన హంగేరియన్ ట్రెక్కర్‌ను భారత సైన్యం కాపాడింది.

Indian Army : హంగేరియన్ ట్రెక్కర్‌ను కాపాడిన భారత సైన్యం

శ్రీనగర్ : హిమాలయ పర్వత ప్రాంతాల్లో దారి తప్పిన హంగేరియన్ ట్రెక్కర్‌ను భారత సైన్యం కాపాడింది. జమ్మూ-కశ్మీరులోని కీష్త్వర్ జిల్లా, ఉమసి కనుమలో సుమారు 30 గంటలపాటు శ్రమించి నిర్వహించిన గాలింపు చర్యల్లో ఆయన జాడను గుర్తించి, రక్షించింది. చికిత్స కోసం ఆయనను భారత వాయు సేన హెలికాప్టర్లో ఉధంపూర్ తరలించారు. 


భారత సైన్యం విడుదల చేసిన ప్రకటనలో, హంగేరియన్ జాతీయుడు (Hungarian National) అక్కోయీస్ వెర్మీస్‌ (Akkoes Vermes)ను భారత వాయు సేన (Indian Air Force), భారత సైన్యం (Indian Army) గుర్తించి, కాపాడినట్లు తెలిపింది. హిమాలయ పర్వత ప్రాంతంలోని ఉమసి కనుమలో ఆయన దారి తప్పిపోయారని తెలిపింది. ఆయనను చికిత్స కోసం ఐఏఎఫ్ ఉధంపూర్‌నకు తరలించినట్లు పేర్కొంది. కీష్త్వర్‌లోని డుల్ నుంచి ఈ ఆపరేషన్ జరిగినట్లు వివరించింది. కీష్త్వర్-జన్‌స్కర్ మధ్య ఉమసి కనుమ ఉంది. అక్కోయీస్ వెర్మీస్‌ లడఖ్‌లో దారి తప్పారా? అనే విషయం తెలియలేదు. 


జూన్‌లో కూడా ఇదే విధంగా 17 మందిని భారత సైన్యం కాపాడింది. ఏడు సరస్సుల ట్రెక్కింగ్ కోసం వీరు వచ్చారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విషన్ సార్ సరస్సు వద్ద చిక్కుకుపోయారు. 


Updated Date - 2022-08-27T23:39:30+05:30 IST