ఐసుముక్కతో యువకుడిని పొడిచేసిన పొరుగింటి వ్యక్తి

ABN , First Publish Date - 2022-01-23T00:27:36+05:30 IST

తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ యువకుడిపై దాడిచేసిన నిందితుడి అతడి కంటిలో ఐసు ముక్కతో ..

ఐసుముక్కతో యువకుడిని పొడిచేసిన పొరుగింటి వ్యక్తి

న్యూఢిల్లీ: తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ యువకుడిపై దాడిచేసిన నిందితుడి అతడి కంటిలో ఐసు ముక్కతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దేశరాజధాని ఢిల్లీలోని టాగోర్ గార్డెన్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుల్లో ముగ్గురు స్థానికులకు చిక్కగా వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 


పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు బబ్లూ.. కుక్రేజా ఆసుపత్రి సమీపంలో ఓ చిన్న గుడిసెలో నివసిస్తున్నాడు. పొరిగింట్లో ఉండే వ్యక్తి భార్యతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దుర్భాషలాడడంతో తట్టుకోలేకపోయిన ఆమె భర్త బబ్లూతో వాగ్వివాదానికి దిగాడు. అది క్రమంగా ముదరడంతో స్నేహితులతో కలిసి దాడి చేశాడు. ఆపై మంచు ముక్కతో బబ్లూ కుడి కంటిలో పొడిచాడు. గమనించిన స్థానికులు నిందితుల్లో ముగ్గురిని పట్టుకున్నారు. వీరిలో ఇద్దరి వయసు 28 ఏళ్లు కాగా, ఓ బాలుడు కూడా ఉన్నాడు. వీరిని చితకబాదిన అనంతరం పోలీసులకు అప్పగించారు.


నిందితులను అంజు, నిలోతిగా గుర్తించామని, మరో నిందితుడు సోహన్ ఠాకూర్ (30) పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గురు గోవింద్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కోలుకుంటున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2022-01-23T00:27:36+05:30 IST