Rahul Padayatra: 30న రాష్ట్రంలోకి ‘భారత్ జోడో’ పాదయాత్ర
ABN , First Publish Date - 2022-09-10T17:03:05+05:30 IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ(Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో’ పాదయాత్రకు సంబంధించి ప్రత్యేకమైన వెబ్సైట్ను లాంఛనంగా
- పేర్ల నమోదుకు వెబ్సైట్ ప్రారంభం
బెంగళూరు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ(Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో’ పాదయాత్రకు సంబంధించి ప్రత్యేకమైన వెబ్సైట్ను లాంఛనంగా ప్రారంభించారు. శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్షనేత సిద్దరామయ్య సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్(DK Sivakumar) మాట్లాడుతూ ఈనెల 30న రాష్ట్రంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. రాష్ట్రంలో 21 రోజుల పాటు 8 జిల్లాల్లో 511 కిలోమీటర్లు యాత్ర సాగుతుందన్నారు. పాదయాత్రలో ఎవరైనా పాల్గొనవచ్చునని, ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. డిజిటల్ ద్వారా కూడా పేర్లు నమోదు చేసుకునే వెసులుబాటు ఉండాలనే వెబ్సైట్ను ప్రారంభించామన్నారు. దసరా సందర్భంగా రెండు రోజుల పాటు పాదయాత్రకు విరామం ఉంటుందన్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా అవసరమైన సౌలభ్యాలు కల్పించేందుకు వీలుంటుందన్నారు. దేశంలో శాంతి సామరస్యం కాపాడటమే లక్ష్యమని, నిరుద్యోగ సమస్య తీవ్రమైందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. రాష్ట్రానికి ప ట్టిన చెదలును విడగొట్టేందుకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలన్నారు. పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జ్ సుర్జేవాలా(Surjewala) మాట్లాడుతూ నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండే ప్రాంతమే మునిగిందన్నారు. బెంగళూరు ప్రజలు పడవల్లో తిరగడం ఇదే తొలిసారి అని ఎద్దేవా చేశారు. సిద్దరామయ్య మాట్లాడుతూ వరద పరిస్థితిని సకాలంలో నియంత్రించలేక సీఎం గత ప్రభుత్వంపై నెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతోందని, ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. పార్టీ సీనియర్ నేతలు పరమేశ్వర్, రామలింగారెడ్డి, కేజే జార్జ్ సహా పలువురు పాల్గొన్నారు.