31 ఏళ్ల జ్ఞాపకం
ABN , First Publish Date - 2021-10-24T05:01:11+05:30 IST
హుస్నాబాద్ పట్టణంలోని అక్కన్నపేట రోడ్డులో నిర్మించిన 88 అడుగుల ఎత్తయిన స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి సోమవారం నాటికి సరిగ్గా 31 ఏళ్లు.
హుస్నాబాద్, అక్టోబరు 23 : బిడ్డలారా మీరొడ్డిన నెత్తురింకా/ నేలలోన పడనివ్వం/ పరిచినది పంచే కాదు../ కడుపుకోత పేగులురా... అంటూ పీపుల్స్వార్ ఉద్యమంలో అమరులైన బిడ్డలను స్మరిస్తూ, హుస్నాబాద్ పట్టణంలోని అక్కన్నపేట రోడ్డులో నిర్మించిన 88 అడుగుల ఎత్తయిన స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి సోమవారం నాటికి సరిగ్గా 31 ఏళ్లు. గ్రానైట్ రాయితో నిర్మించిన ఈ స్తూపం ఆసియాలో రెండో అతిపెద్దది. 1972 నుంచి 1989 మధ్య కాలంలో ఎదురుకాల్పుల్లో మృతిచెందిన నక్సలైట్ల పేర్లను ఈ నిర్మాణంపై చెక్కించారు. 25 అక్టోబర్ 1990న వేలాది మంది సమక్షంలో ఆవిష్కృతమైన ఈ స్తూపం అనంతరం పదేళ్లలోనే నేలమట్టమయింది. దీని ఆవిష్కరణ సమయంలో ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో నక్సలైట్లు ముగ్గురు అధికారులను కిడ్నాప్ చేసి మరీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత పోలీసు చర్యలతో స్తూపం ధ్వంసమవుతూ వచ్చింది. 2000లో హుస్నాబాద్లోని మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బొప్పరాజు లక్ష్మీకాంతరావు ఇంటిని నక్సలైట్లు పేల్చివేయడంతో ప్రతిగా గ్రీన్టైగర్స్ పేరుతో ఈ స్తూపాన్ని డిటోనేటర్లు పెట్టి పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత దీన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్ వచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాంతంలో ఇప్పుడు తుమ్మలు పెరిగి అమరుల త్యాగాలను వెక్కిరిస్తున్నది.