వెంకన్న దర్శనానికి 36గంటలు
ABN , First Publish Date - 2022-10-07T07:17:19+05:30 IST
తిరుమల క్షేత్రంలో గురువారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
తిరుమల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తిరుమల క్షేత్రంలో గురువారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పెరటాశి మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో, బ్రహ్మోత్సవాలు పూర్తయిన క్రమంలో గురువారం ఉదయం నుంచి తిరుమలకు భక్తుల రాక పెరిగింది. ఈక్రమంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా సర్వదర్శన భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 10 గంటల సమయానికే సర్వదర్శనం క్యూలైన్ నారాయణ గిరి విశ్రాంతి భవనం వెనుకభాగంలో రింగ్రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు చేరింది. సాయంత్రం 6 గంటల సమయానికి 36 గంటల దర్శన సమయం పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది.శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు నాలుగుమాడవీధులు, లడ్డూకౌంటర్, అఖిలాండం, అన్నప్రసాదభవనం, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. అలాగే గదులకు డిమాండ్ భారీగా పెరిగింది.గది తీసుకోవడానికి 4నుంచి 6 గంటల సమయం పడుతోంది. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టల్లోనూ భక్తులు కిక్కిరిసిపోయారు.