భూములిచ్చిన మాపైనే కక్షా..

ABN , First Publish Date - 2021-01-17T05:10:52+05:30 IST

భూములిచ్చిన మాపైనే కక్షా..

భూములిచ్చిన మాపైనే కక్షా..
పెదపరిమి దీక్షా శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు

396వ రోజు నిరసనల్లో అమరావతి రైతులు 

తుళ్లూరు/మంగళగిరి/తాడేపల్లి/తాడికొండ, జనవరి 16 : రాజధాని కోసం భూములు త్యాగం చేసిన తమపైనే ప్రభుత్వం కక్ష కట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం 396వ రోజుకు చేరాయి. తుళ్లూరు, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం, ఐనవోలు తదితర గ్రామాల్లోని రైతు దీక్ష శిబిరాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి, మూడు రాజధానుల డ్రామా ఆడుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ నుంచి వచ్చిన ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌, హైదరాబాద్‌ నుంచి వచ్చిన జె.విజయ్‌కుమార్‌ రైతులకు మద్దతు తెలిపారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, బేతపూడి, నీరుకొండ గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో  రైతులు, మహిళలు పాల్గొన్నారు. పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి.

Updated Date - 2021-01-17T05:10:52+05:30 IST