Third wave తప్పదు.. ఐఎమ్ఏ హెచ్చరిక
ABN , First Publish Date - 2021-07-12T22:02:03+05:30 IST
కరోనా మూడో ముప్పు(మూడో వేవ్) ముంచుకొస్తోందని భారతీయ వైద్యుల సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) తాజాగా హెచ్చరించింది.
న్యూఢిల్లీ: కరోనా మూడో ముప్పు(3వ వేవ్) ముంచుకొస్తోందని భారతీయ వైద్యుల సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) తాజాగా హెచ్చరించింది. కరోనా నిబంధనల అమలులో అలసత్వం పనికిరాదని, రక్షణాత్మక వైఖరిని విడనాడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇటీవల దేశంలో పలు చోట్ల ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడం, ఈ విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడంపై ఐఎమ్ఏ ఆందోళన వ్యక్తం చేసింది.
‘‘ఇటువంటి మహమ్మారుల చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధారాలు..మూడో వేవ్ తప్పదని చెబుతున్నాయి. పర్యాటక రంగ బోనాంజాలు, మతమరమైన కార్యక్రమాలు, తీర్థయాత్రలు అవసరమే! అయితే వీటిని మరి కొన్ని నెలలు వాయిదా వేసుకోవచ్చు. ఇటువంటి వాటిని అనుమతించి, టీకాలు తీసుకోని వారికి ఈ కార్యక్రమాల్లో పూర్తి స్వేఛ్చ ఇస్తే..వారు సూపర్ స్ప్రెడర్లుగా మారవచ్చు.’’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా నిబంధనలు పక్కాగా పాటించడం, సార్వత్రిక టీకాకరణ ద్వారా మూడో ముప్పు ప్రభావాన్ని చాలా వరకూ తగ్గించవచ్చని మొదటి, రెండో వేవ్ అనుభవాలు మనకు సూచిస్తున్నాయని ఐఎమ్ఏ పేర్కొంది.