Anurag Thakur: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు
ABN , First Publish Date - 2022-09-28T21:18:09+05:30 IST
దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ..
న్యూఢిల్లీ: దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం కరువుభత్యం (DA-Dearness Allowance) పెంచుతున్నట్టు (HIKE) ప్రకటించింది. 2022 జూలై 1 నుంచి ఈ పెంపు అమలు చేస్తారు. ఇందువల్ల 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. పెంచిన డీఏతో ప్రభుత్వంపై రూ.6,591.36 కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారంనాడు మీడియాకు తెలిపారు.
కేంద్ర క్యాబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలను కూడా ఆయన వివరించారు. మూడు ప్రధానమైన రైల్వే స్టేషన్ల రీ-డవలప్మెంట్ కోసం భారతీయ రైల్వేలు చేసిన ప్రతిపాదనలకు కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. ఈ రైల్వేస్టేషన్లలో న్యూఢిల్లీ, అహ్మదాబాద్, సీఎస్ఎంటీ, ముంబై ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు సుమారు రూ.10,000 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేశారు.
మరో మూడు నెలలు ఉచిత రేషన్
కాగా, కేంద్ర క్యాబినెట్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. పీఎంజీకెఎవై (ఉచిత రేషన్)ను మరో మూడు నెలలు పాటు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.